రివ్యూ : ఒక్కడు మిగిలాడు
బ్యానర్ : పద్మజ ఫిల్మ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
తారాగణం : మంచు మనోజ్, రెజీనా, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి తదితరులు
కూర్పు : కార్తీక శ్రీనివాస్
కళ: పీఎస్ వర్మ
సంగీతం : శివ నందిగామ
ఛాయాగ్రహణం : వి.కోదండ రామరాజు
నిర్మాతలు : ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్
స్క్రీన్ప్లే : గోపీ మోహన్
కథ, దర్శకత్వం : అజయ్ ఆండ్రూస్
విడుదల తేదీ : నవంబర్ 11, 2017
మంచు మనోజ్ హిట్ కోసం నానా యాతన పడుతున్నాడు. మొదటి నుంచి రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా కొత్త ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇప్పుడు తాజాగా శరణార్థుల గోడును కథాశంగా తీసుకుని.. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా పద్మజ ఫిలింస్ ఇండియా ప్రై.లి బ్యానర్ఫై రూపొందుతున్న చిత్రం ఒక్కడు మిగిలాడు. మరి మంచు మనోజ్ చేసిన మరో ప్రయోగం తెలుగు ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో తెలియాలలంటే రివ్యూలోకి వెళ్ళాల్సిందే..!
సూర్య(మంచు మనోజ్) యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్. శరణార్థుడైన అతడిని ఒక కాలనీ వారు చేరదీసి పెంచుతారు. అయితే అదే కాలనీకి చెందిన ముగ్గురు అమ్మాయిలను మంత్రి కొడుకులు అత్యాచారం చేయాలనుకుంటారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ముగ్గురు అమ్మాయిలు పురుగులమందు తాగి చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వారికి న్యాయం జరగాలని పోరాటానికి దిగుతారు. అతడికి స్వర్ణ(అనీషా ఆంబ్రోస్) అనే జర్నలిస్ట్ సపోర్ట్ చేస్తుంది. అయితే పోలీసులు సూర్యను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతారు. అయినా సూర్య లొంగకపోవడంతో మంత్రి అతడిని చంపాలని నిర్ణయించుకుంటాడు. చివరకు సూర్య ఏమయ్యాడు.. చనిపోయిన ముగ్గురు అమ్మాయిలకు న్యాయం జరిగిందా.. సూర్య పోరాట లక్షణాలు ఎలా వచ్చాయి.. అనే విషయాలు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
శ్రీలంకలో ఉండే శరణార్థులు తమకు ప్రత్యేకంగా ఒక దేశం కావాలని పోరాడిన సంగతి తెలిసిందే. వీరికి నాయకత్వం వహించిన ఎల్టీటీఈ చీఫ్ ప్రభాకరన్ జీవితంలో కొన్ని ఘట్టాలను తీసుకొని దర్శకుడు ఈ సినిమా కథను సిద్ధం చేసుకున్నారు. అయితే ఆయన రాసుకున్న కథ ఏమాత్రం ఆకట్టుకోలేదు. తెరపై మరింత క్రూరత్వాన్ని చూపించారు. ఎంతసేపు ఒకరినొకరు చంపుకోవడం తప్ప సినిమాలో అసలు కథ చూపించలేదు. కథను ప్రారంభించిన తీరుకి ముగింపు పొంతన లేదనిపిస్తుంది. డాక్యుమెంటరీ చేయాల్సిన కథతో రెండున్నర గంటల సినిమా చేయడమనే ఆలోచనే ప్రేక్షకుణ్ని ఆలోచనలోకి నెట్టేస్తుంది. ఒక వీరుడు కథను తెరపై చూపిస్తాడేమో, తెలియని విషయాలు తెలుసుకోవచ్చేమో.. అనుకుని థియేటర్కు వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు. మనోజ్ నటన శ్రుతిమించినట్లు అనిపిస్తుంది. పీటర్ అనే పాత్రలో చాలా లావుగా కనిపించాడు. రెండు పాత్రల్లో తేడాను చూపించడానికే మనోజ్ బరువు పెరిగినట్లు అనిపిస్తోంది. ఇక సూర్య పాత్రలో ఓకే అనిపించాడు. అనీషా ఆంబ్రోస్ ఉన్నంతలో ఓకే అనిపించింది.
ఇక సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ కూడా విక్టర్ అనే పాత్రలో నటించాడు. సినిమాలో హీరో కంటే ఈ పాత్రకు కాస్త వెయిట్ ఎక్కువుందని చెప్పాలి. నటుడిగా ఆడియన్స్ను మెప్పించినప్పటికీ దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు. గ్రాఫిక్స్ వర్క్ సరిగ్గా లేదు. కెమెరా పనితనం పర్వాలేదనిపిస్తుంది. నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. చాలా వరకు సినిమాను సాగదీశారు. అసలు కథను వదిలేసి మిగిలిన విషయాలపై దృష్టి పెట్టారు. కొత్తగా ఉంటుందని మనోజ్ ప్రయత్నించినప్పటికీ సినిమా మాత్రం ఆడియన్స్ను ఏమాత్రం ఆకట్టుకోదు. మొత్తం మీద ఈ ఒక్కడు మిగిలాడు ఒక విఫల ప్రయత్నంగానే మిగిలిపోయిందనే భావన ప్రేక్షకుల్లో కల్గుతోంది.
# రేటింగ్ : 2/5
# దరువు పంచ్ లైన్ : మరో విఫల ప్రయత్నం..!