ఏపీ ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు రెడీ అవుతున్న తరుణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ భార్య, జగన్ తల్లి విజయమ్మ మీడియా ముందుకు వచ్చారు. అప్పుడు తన భర్తను ఆదరించినట్టే, ఇప్పుడు తన కుమారుడు జగన్ను కూడా ఆదరించాలని వైసీపీ గౌరవాధ్యక్షురాలు, దివంగత నేత రాజశేఖరరెడ్డి సతీమణి విజయమ్మ ప్రజలను కోరారు.
ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ నా కొడుకును మీ చేతుల్లో పెడుతున్నానని ఆనాడే చెప్పా. మీ మనవడిగా, కొడుకుగా, తమ్ముడిగా జగన్ను ఆదరించండి. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని విన్నవించారు. నాడు తన భర్త వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్రలో ఎన్నో అంశాలను గమనించారని, పేదల కోసం సంచలన నిర్ణయాలు తీసుకున్నారని ఆమె అన్నారు.
రైతులు, మహిళలు, వృద్ధుల సమస్యలను ప్రత్యక్షంగా చూశారని, అధికారంలోని రాగానే పెన్షన్ నెలనెలా వచ్చేలా చేశారని, సీఎంగా బాధ్యతలు చేపట్టి ఉచిత విద్యుత్ ఫైల్ పై తొలి సంతకం చేశారని విజయమ్మ గుర్తుచేశారు.పావలా వడ్డీకే రుణాలు, వైద్య సదుపాయాలు అందించే 104,108 సేవలు, ఆరోగ్య శ్రీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్, లాంటి ఎన్నో ప్రజా సంక్షేమ పథకాలను వైఎస్ఆర్ అమలు చేశారని అన్నారు.
అయితే ఇప్పుడు ఆ పథకాల అమలు తీరు చూస్తే బాధేస్తోందని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యానించారు. జగన్కు ఒకసారి అవకాశం ఇస్తే మంచి పాలన అందిస్తాడు… సేవ చేయాలనే తపన తనకు ఉందని ఆమె తెలియజేశారు. వైసీపీ ఉండటం వల్లే వైఎస్ పథకాలు ఎంతో కొంత అమలు అవుతున్నాయని వ్యాఖ్యానించారు. వైసీపిీకి అదికారం ఇస్తే జగన్ స్వర్ణయుగం తెస్తాడని అన్నారు.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో చేసే పాదయాత్ర సోమవారం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రారంభం అవుతుంది. ఇడుపులపాయ నుంచి మొదలైన ఈ పాదయాత్ర ఆరు నెలలపాటు 3 వేల కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగుస్తుంది. పాదయాత్ర ద్వారా ఏపీలోని 125 నియోజకవర్గాలను కవర్ చేసేలా రూట్ మ్యాప్ రూపొందించారు.