అంబులెన్స్ కుయ్ కుయ్ మంటూ రోడ్డెక్కిందంటే చాలు.. ఎవరో ఒకరు ప్రాణాపాయంతో ఉన్నారని అర్ధం. ఇక అంబులెన్స్ డ్రైవర్లు అయితే ఎవరైనా ప్రాణాపాయంలో ఉన్నారని తెలిస్తే చాలు పరుగుపరుగున వెళ్ళి బాధితులను ఆదుకోవడం వారి కర్తవ్యం.. విది. మరి అలాంటి అంబులెన్స్ నడిపే డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులకు చిక్కి.. వారు చేసే వృత్తికి తలవంపులు తెచ్చారు.
విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ టోల్ ప్లాజా వద్ద మంగళవారం (డిసెంబర్ 12) డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న చౌటుప్పల్ పోలీసులకు ఆల్కహాల్ తాగి అంబులెన్స్ నడుపుతున్న ఇద్దరు డ్రైవర్లు చిక్కారు. AP28 AB8629, AP 09W7938 అనే వాహనాల డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ ఎనలైజర్లో వీరి ఆల్కహాల్ రీడింగ్ వరసగా 111 mg, 77 mg గా నమోదైంది. 30 mg/ 100ml కంటే అధికంగా రీడింగ్ నమోదైతే.. ఎక్కువ మోతాదులో మద్యం సేవించినట్లే లెక్క. దీంతో వీరిద్దరినీ అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు రాచకొండ పోలీసులు తెలిపారు.