మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడోసారి వస్తున్న చిత్రం అల వైకుంఠపురంలో.. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుండి రెండో పాట టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. రాములో రాములా అంటూ సాగే ఈ పాట లిరిక్స్ ను శ్యామ్ రాయగా.. అనురాగ్ కులకర్ణి, మంగ్లీ ఆలపించారు. 26 సెకన్ల పాటు ఈ పాట టీజర్ ను చూపించగా.. రాములో రాములా నన్నాగము చేసిందిరో.. రాములో రాములా నా పాణము తీసింది రో అంటూ వచ్చే ఈ పాట కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. పూర్తి పాటను ఈ నెల 26న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. కాగా 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
