లైగర్ సినిమాతో ఘోర పరాజయాన్ని సొంతం చేసుకున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. ఈ మూవీ వల్ల ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయామని డబ్బులు తిరిగి చెల్లించాలని మూవీ డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు పూరీని అడుగుతున్నారు. ఈమేరకు ఇటీవల పూరీ జగన్నాథ్ డిస్ట్రిబ్యూటర్లు డబ్బు కోసం తనని బెదిరిస్తున్నారని, వారి నుంచి తనకు ప్రాణ హాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈరోజు డిస్ట్రిబ్యూటర్లు సైతం పూరీ ఇంటి ఎదుట ధర్నా చేసేందుకు రెడీ అయ్యారు. ఈ తరుణంలో జూబ్లిహిల్స్లోని పూరీ కుటుంబానికి రక్షణగా పోలీసులు ఆయన ఇంటి వద్దకు వెళ్లి భద్రత కల్పించారు.
భారీ అంచనాలతో పాన్ ఇండియా రేంజ్లో రిలీజైన విజయదేవరకొండ లైగర్ మూవీ అట్టర్ఫ్లాప్గా నిలించింది. దీంతో ఈ మూవీని కొన్న నైజాం డిస్ట్రిబ్యూటర్, ఫైనాన్షియర్ వరంగల్ శీను, శోభన్ బాబులు నష్టపోయిన డబ్బు తిరిగి చెల్లించాలని పూరీపై ఒత్తిడి తీసుకొచ్చారు. ఈ మేరకు పూరీకు లేఖలు కూడా రాశారు. ఇటీవల దీనికి సంబంధించి పూరీ మాట్లాడిన ఓ ఆడియో ఫైల్ కూడా వైరల్గా మారింది. అయితే ప్రస్తుతం పూరీ జగన్నాథ్ హైదరాబాద్లో లేనందున డిస్ట్రిబ్యూటర్లు ఎవరూ ఆయన ఇంటిని ముట్టడించలేదు. ఈ విషయమై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కోర్టుకు వెళ్లనున్నారట.