వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్ ట్యాపింగ్ చేసిన మాట నిజమేనని హైకోర్టు ముందు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. దీనిపై స్పందించిన హైకోర్ట్ వివరాలను కౌంటర్ రూపంలో లిఖితపూర్వకంగా తమముందు ఉంచాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. న్యాయమూర్తులు జస్టిస్ ఆకుల వెంకట శేషసాయి, జస్టిస్ ఉప్మాక దుర్గా ప్రసాద్లతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తనతో పాటు తమ పార్టీకి చెందిన నాయకుల ఫోన్లు టీడీపీకోసం పోలీసులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. తమ పార్టీకి చెందిన ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేస్తున్నారో జాబితా ఇవ్వాలని ఆయన కేంద్ర హోంశాఖ కార్యదర్శి, టెలి కమ్యూనికేషన్స్ కార్యదర్శి, వోడాఫోన్ ఏపీ, తెలంగాణ నోడల్ ఆఫీసర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించాలని ఆయన కోర్టును కోరారు. అదే విధంగా డీజీపీ ఠాకూర్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, ఇంటెలిజెన్స్ డీజీలను టెలిగ్రాఫ్ చట్టం కింద ప్రాసిక్యూట్ చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన హైకోర్టును కోరారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.. ఈ విచారణపై స్పందిస్తూ ఏఏ సందర్భాల్లో ట్యాపింగ్ చేయవచ్చో సెక్షన్ 5(2) చెబుతోందని, ఇదే విషయంపై సుప్రీంకోర్టు సైతం స్పష్టమైన తీర్పునిచ్చిందని గుర్తు చేసింది. ఘటనపై ప్రభుత్వం తరఫు అడ్వొకేట్ జనరల్ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ సెక్షన్ 5(2)ను అనుసరించే ఫోన్ ట్యాప్ చేసామన్నారు.
అయితే 1.దేశ సమగ్రత, సార్వభౌమత్వం 2. దేశ భద్రత 3.విదేశాలతో స్నేహ సంబంధాలు 4. పబ్లిక్ ఆర్డర్ 5.నేర ప్రేరేపణను నిరోధించడం. ఈ ఐదు సందర్భాల్లో మాత్రమే ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చునని టెలిగ్రాఫ్ చట్టం చెబుతోంది. ఈ సందర్భాలు మినహా మిగిలిన ఏ సందర్భాల్లోనూ ఫోన్ ట్యాప్ చేయరాదనికి సుప్రీంకోర్టు పీయూసీఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ టీడీపీ ప్రభుత్వం ఈ ఐదు సందర్భాలను అనుసరించే వైసీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు చెబుతోంది. అసలు విషయానికొస్తే సజ్జల రామకృష్ణారెడ్డి నెంబర్తో పాటు ఇతర పార్టీ నేతల ఫోన్ నెంబర్లను ఉగ్రవాదుల జాబితాలో చేర్చి ట్యాప్ చేయాలని వోడాఫోన్ కంపెనీకి చంద్రబాబు ప్రభుత్వం ఇవ్వడం వారి బరితెగింపు రాజకీయాలకు అద్దం పడుతోంది.