తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ ద్వారా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం 131 మున్సిపాలిటీల కమిషనర్లు, సీడీఎంఏ అధికారులతో విడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. గతంలో గ్రేటర్ హైదరాబాద్, వరంగల్ తో పాటు పలు కార్పొరేషన్లలోఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించినా..వచ్చే మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్దతిలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈవీఎంలు సరిపడా లేకపోవడం, సాంకేతిక ఇబ్బందుల నేపథ్యంలో బ్యాలెట్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తున్నది.
ఇందుకోసం బ్యాలెట్ పత్రాలను స్థానికంగా ముద్రించు కోవచ్చని పేర్కొన్నది. ఆయా మున్సిపాలిటీల పరిధిలో ముద్రణ సంస్థలను ఎంపిక చేయాలని ఎస్ఈసీ సూచించింది.అటు ఎన్నికల కోసం వార్డుల వారీగా ఓటర్ల జాబితాను రెడీ చేస్తున్నరు. వార్డుల విభజన పూర్తి కావడంతో పోలింగ్ చేంద్రాల తుది జాబితా కూడా సిద్ధమవుతున్నది. పోలింగ్ కేంద్రాల ముసాయిదాను ఈ నెల 10న విడుదల చేయాల్సి ఉన్నది. 800 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండాలని, 800 దాటి ఐదుగురు ఓటర్లున్నా ప్రత్యేక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఎస్ఈసీ స్పష్టం చేసింది.131 మున్సిపాలిటీల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల ఓటరు జాబితాను దాదాపు ఖరారు చేసి..సీడీఎంఏకు అప్పగించారు. ఈ నెల 18న ఓటర్ల ఫోటోలతో తుది జాబితా విడుదల చేయాలని ఎస్ఈసీ ఆదేశాలిచ్చింది.
131 మున్సిపాలిటీలతో పాటు కరీంనగర్, నిజామాబాద్, రామగుండం కార్పొరేషన్లలో పోటో ఓటరు జాబితాను ఖరారు చేయాలని నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నెల 12న ఓటరు జాబితా ముసాయిదాను వార్డుల వారీగా విడుదల చేయాలని, 12 నుంచి 16 వరకు ఓటర్ జాబితాపై అభ్యంతరాలు స్వీకరించాలని షెడ్యూల్ లో పేర్కొన్నారు. ఈ నెల 12న జిల్లా ఎన్నికల అధికారుల అధికారుల ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో 13న మున్సిపాలిటీల్లో రాజకీయ పక్షాలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.18న వార్డుల వారీగా ఓటర్ల ఫోటోలతో తుది జాబితా విడుదల చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నాగిరెడ్డి ఆదేశించారు. నోటిఫికేషన్ విడుదలయ్యే వరకూ జాబితాలో మార్పులు, చేర్పులు, కొత్త ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుందన్నరు.