మేడారం జాతర నేపథ్యంలో రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా రోడ్లను అభివృద్ధి చేయాలని, అవసరమైన మరమ్మత్తులు పూర్తి చేయాలని మంత్రులు ఉన్నతాధికారులను ఆదేశించారు. డిసెంబర్ లోపు అన్ని రకాల రోడ్డు పనులను పూర్తి చేసి ప్రయాణికులకు సాఫిగా ప్రయాణం సాగేలా చూడాలని చెప్పారు. జాతీయ రహదారుల విభాగం వరంగల్ డివిజన్ పరిధిలోని పనులపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ గురువారం హైదరాబాద్ లోని పంచాయతీరాజ్ మంత్రి కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, రోడ్లు – భవనాల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ గణపతి రెడ్డి, ఎస్ఈ వసంత, ఈఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వరుస వర్షాల నేపథ్యంలో దెబ్బతిన్న రోడ్లను వెంటనే మరమ్మత్తులు చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. ‘‘ హైదరాబాద్ నుంచి వరంగల్ మీదుగా ఎక్కువ మంది భక్తులు మేడారం జాతరకు వస్తారు. జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాకపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంది. ఆలేరు, వంగపల్లి, వరంగల్ నగరం బైపాస్ రహదారుల పనులను వేగంగా పూర్తి చేయాలి. అలాగే ఖమ్మం, భద్రాచలం, మహబూబాబాద్, కరీంనగర్ మార్గాల నుంచి మేడారం జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలుగకుండా రోడ్లకు అవసరమైన మరమ్మత్తులు చేయాలి. వరంగల్ – ఖమ్మం రహదారి బాగా దెబ్బతిన్నది. శాశ్వత మరమ్మత్తులతో పాటు తక్షణం తాత్కలికంగా మరమ్మత్తులను పూర్తి చేయాలి. వరంగల్ NH డివిజన్ కు సంబంధించి ప్రతిపాదన దశలో ఉన్న 5 రహదారులకు జాతీయ రహదారి హోదా వచ్చేలా డిల్లీ స్థాయిలో ఎంపీలు సంప్రదింపులు జరపాలి. వరంగల్ నగరంలోని ఖాజీపేట – పెద్దమ్మగడ్డ, పోలీసు హెడ్ క్వార్టర్స్ – కేయు క్రాస్ రోడ్డు పనులను ఈ నెలలో పూర్తి చేయాలి. అలాగే రాంపూర్ నుంచి ఖాజీపేట వరకు దెబ్బతిన్న హైదరాబాద్- వరంగల్ రహదారి మరమ్మత్తులకు ప్రతిపాదనలు సిద్దం చేసి పనులు ప్రారంభించాలి. వర్షాలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రోడ్ల మరమ్మత్తు పనులను వెంటనే ప్రారంభించాలి. ఖాజీపేట రైల్వే బ్రిడ్జి నిర్మాణం పనులను త్వరగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలి. పాలకుర్తి నియోజకవర్గంలోని దేవరుప్పుల, మొండ్రాయి (గిర్ని తండ) జంక్షన్ అభివృద్ధి పనులను చేయాలి. జనగామ పట్టణంలో ప్రధాన రహదారి మరమ్మత్తు ప్రతిపాదనలు రూపొందించాలి. మేడారం జాతరకు అనుసంధానం అయ్యే అన్ని రకాల జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, ఇతర అన్ని రోడ్ల పనులను డిసెంబర్ లోపు పూర్తి చేయాలి. అన్ని రకాల మరమ్మత్తులు, విస్తరణ పనులను నవంబర్ లోగా పూర్తి చేయాలి. డిసెంబర్ చివరలో అన్ని పనులపై మరొకసారి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించుకుందాం. ఆలోపు పనులు పెండింగ్ లో ఉండకుండా చర్యలు తీసుకోవాలి’’ అని మంత్రులు అధికారులను ఆదేశించారు.