తెలంగాణ రాష్ట్రం అన్నింటా ప్రథమ స్థానంలో ఉంది.. అక్షరాస్యతలోనూ నంబర్ వన్గా నిలువాలన్నదే సీఎం కేసీఆర్ సంకల్పమని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చెప్పారు. అందరినీ అక్షరాస్యులుగా చేయాలన్న లక్ష్యం తో ప్రభుత్వం ఈచ్ వన్-టీచ్ వన్ కార్యక్రమాన్ని తీసుకున్నదన్నారు. మంగళవారం జేసీ పద్మాకర్, సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డిలతో కలిసి బుస్సాపూర్లో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వృద్ధులకు మంత్రి స్వయంగా అక్షరాలు దిద్దించారు. వందశాతం అక్షరాస్యత సాధించేందుకు గ్రామాల్లోని యువత ముందుకురావాలని మంత్రి పిలుపునిచ్చారు. అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలంటే సాధ్యం కాదని, యువత ఖాళీగా ఉండకుండా ఏదో ఓ పనిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ ఒకేసారి పంచాయతీ కార్యదర్శులను నియమించడంతో పల్లెలన్నీ అద్భుత గ్రామాలుగా తయారవుతున్నాయన్నారు.
యువత కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమైతే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ముందుకొచ్చిన యువత అందరికీ న్యాక్లో ఉచితంగా శిక్షణ ఇప్పిస్తానన్నారు.ఈ నేపథ్యంలో గ్రామంలోని ఒక వృద్ధురాలితో ఆమె పేరు రాసి .. దిద్దించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరలవుతుంది.