నేటి రోజుల్లో చాలామంది రాజకీయ నాయకులకు తమ శక్తి సామర్థ్యాల కంటే వాస్తు, జ్యోతిష్యం పట్ల నమ్మకం ఎక్కువ. అందుకే ఏ పని చేయాలన్నా.. ముహూర్తం చూసుకుని మరీ మొదలుపెడుతారు. ఏపీ సీఎం చంద్రబాబు ఈ విషయంలో ముందుంటారు.
ఏపీ ప్రతిపక్ష అధినేత జగన్ కూడా ఇందుకు మినహాయింపేమి కాదు. బహుశా తన శక్తి వంచన మేరకు కృషి చేస్తున్నా.. అధికారం దక్కకపోవడం వల్లే ఆయన కూడా జ్యోతిష్యాలు, ముహూర్తాలు వంటి వాటిని నమ్మాల్సి వస్తుందేమో!. అందుకే త్వరలో మొదలుపెట్టబోయే పాదయాత్ర కోసం పక్కాగా ముహూర్తం చూసుకుంటున్నారట జగన్.నిజానికి అక్టోబర్ 27నుంచి పాదయాత్ర చేయాలని జగన్ భావించారు. ఇదే విషయమై జ్యోతిష్యులను సంప్రదిస్తే.. అది ఏమాత్రం శుభం కాదని వారు కుండబద్దలు కొట్టారట. ఆరోజు గనుకు పాదయాత్ర మొదలుపెడితే దానివల్ల డ్యామేజీ తప్ప కొత్తగా ఒనగూరేది ఏమి ఉండదని తేల్చి చెప్పారట.
2019ఎన్నికలు వైసీపీకి చావో రేవో తేల్చుకోవాల్సిన సందర్భం కావడంతో.. పాదయాత్రను పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఇంతటి ప్రాధాన్యం ఉన్న పాదయాత్రను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తే శుభం కలుగుతుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొంతమంది జ్యోతిష్యుల్ని సంప్రదించి సలహాలు కోరారట.