ఏపీ అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ,నవ్యాంధ్ర రాష్ట్ర అసెంబ్లీ తొలి స్పీకర్ అయిన కోడెల శివప్రసాదరావు తనయుడు అయిన కోడెల శివరామకృష్ణపై గత మూడున్నర ఏండ్లుగా పలు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారు అని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెల్సిందే .ఒకానొక సమయంలో స్థానిక ప్రజలు కూడా కోడెల తనయుడుపై తిరగబడుతూ పలు మార్లు ధర్నాలు ..రాస్తోరోకులు చేశారు కూడా .
అయితే తాజాగా కోడెల తనయుడుకి ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీచేసింది .అసలు విషయానికి వస్తే రాష్ట్రంలో గుంటూరు జిల్లాలో సత్తెనపల్లి మండలం పరిధిలోని ధూళిపాళ్ల గ్రామంలోని సర్వే నంబర్ 167, 168ల్లో తనకున్న 11.60 ఎకరాల భూమిని స్పీకర్ కోడెల శివప్రసాదరావు కుమారుడు ఆక్రమించుకోవడంపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ రైతు గొడుగుల సుబ్బారావు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉమ్మడి హైకోర్టు సంచలన తీర్పును ప్రకటించింది .
దీనిలో భాగంగా రైతు సుబ్బారావు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ఉమ్మడి హైకోర్టు దీనికి సంబంధించిన వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, గుంటూరు రేంజ్ ఐజీ, జిల్లా రూరల్ ఎస్పీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్ జనరల్, ఆర్డీవో, తహసీల్దార్లకు నోటీసులు జారీ చేశారు. అంతే కాకుండా దీనికి సంబంధించి వ్యక్తిగత ప్రతివాదులుగా ఉన్న డీఎస్పీ ఎం.మధుసూదన్రావు, సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వెంకటరావు, కోడెల శివరామకృష్ణ, అతని పీఏ గుత్తా నాగప్రసాద్లకు కూడా ఉమ్మడి హైకోర్టు నోటీసులు జారీచేసింది .