తెలంగాణలో జరిగే వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్తో పొత్తు వ్యవహారం టీ- టీడీపీలో కలకలం రేగుతోంది. పొత్తుకు అనుకూలంగా.. వ్యతిరేకంగా టీడీపీ రెండు వర్గాలుగా చీలి పోవడంతో ఆ పార్టీని ఓ రకమైన సంక్షోభంలోకి నెట్టిందనే చెప్పాలి. ఇటీవల చంద్రబాబుతో జరిగిన టీ- టీడీపీ నేతల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్తో పొత్తు వ్యవహారాన్ని చంద్రబాబు ఖండించలేదు. టీఆర్ఎస్తో ఎలాంటి పొత్తు ఉండదని ఆయన స్పష్టంగా చెప్పలేదు. ఈ నేపథ్యంలోనే, టీఆర్ఎస్ తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రేవంత్ రెడ్డి ఆ మరుసటి రోజే టీ-టీడీపీలో తనకు అనుకూలంగా ఉన్న నేతలతో సమావేశమయ్యారు. టీఆర్ఎస్తో పొత్తకు టీ-టీడీపీ సీనియర్లు అయిన రమణ, మోత్కుపల్లి తదితరులు మొగ్గు చూపుతుండగా.. రేవంత్ రెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి తదితరులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో టీడీపీ మళ్లీ బలపడుతోందని టీడీపీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతానికి వీరు తమ వాదనతో చంద్రబాబును కన్విన్స్ చేయడంలో సఫలమయ్యారు. ఈ నేపథ్యంలోనే అదే జరిగితే రేవంత్ రెడ్డి వర్గం పార్టీపై తిరుగుబాటు చేసే అవకాశం ఉందని సమాచారం.
ఇక ఇటీవల రేవంత్ రెడ్డికి దగ్గర బంధువయ్యే కేంద్ర మంత్రి మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి ఓ ప్రపోజల్ పెట్టారట. రేవంత్ రెడ్డి ఇంట్లో ఇటీవల జరిగిన ఓ కార్యక్రమానికి ఆయన వచ్చారట. ఈ సందర్భంగా రేవంత్ ను జైపాల్ రెడ్డి కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. తమ పార్టీలోకి వస్తే, సోనియా గాంధీ.. రాహుల్గాంధీలతో మాట్లాడి అత్యథిక ప్రాధాన్యం దక్కేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారట. చంద్రబాబు, కేసీఆర్ లు కలిసిపోతున్నారని.. ఈ సమయంలో టీడీపీలో ఉంటే ఆత్మాభిమానాన్ని దిగమింగుకుని ఉండాల్సిందే తప్ప.. స్వేచ్చగా రాజకీయం చేయడం సాధ్యం కాదని పెద్దాయన రేవంత్ రెడ్డికి సూచించారట. ఇక జైపాల్ రెడ్డి సూచనకు కాసింత మెత్తబడిన రేవంత్ రెడ్డి… కాంగ్రెస్లో చేరాలంటే తనకు కొన్ని అనుమానాలున్నాయని వాటిపై సరైన హామీ లభిస్తే ఆలోచనచేస్తానని వివరించినట్టు సమాచారం. ఒక వేళ రేవంత్ రెడ్డి టీడీపీని వీడితే ఆయనతో పాటు.. ఉమా మాధవరెడ్డి, రావుల చంద్రశేఖర్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, ఆర్ ప్రకాష్ రెడ్డి లతో భారీ సంఖ్యలో టీడీపీ క్యాడర్ పార్టీని వీడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు.