హేట్సాఫ్ బస్సు కండక్టర్… నువ్వు సామాన్యుడివే కావచ్చు. కాని.. నీ సంకల్ప బలం గొప్పది… నీ మనసు గొప్పది.. గొప్ప వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. ఇక అసలు విషయానికి వస్తే…
తమిళనాడులోని కోయంబత్తూరుకు చెందిన ఎం యోగనాథన్ తమిళనాడు స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎన్ఎస్టీసీ)లో బస్ కండక్టర్గా పనిచేస్తున్నాడు. వయసు 48 ఏండ్లు.
కాని..పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు సాయంగా గొప్ప మనసుతో గత 28 ఏండ్లుగా దాదాపు 38,000 మొక్కలను నాటాడు. ఇందులో వింతేముందని అనుకోకండి.. 38,000 మొక్కలను ఆయన సంపాదించిన డబ్బులతోనే కొని మరీ నాటాడట. అదీ ఆయన గ్రేట్నెస్.
కోయంబత్తూరుకు దగ్గరలోని మయిలాదుథురయై ఆయన సొంత గ్రామం. బస్ కండక్టర్గా విధులు నిర్వర్తించిన తర్వాత యోగనాథన్ తన సమయాన్ని కోటగిరి ఫారెస్ట్లో గడుపుతాడట. అక్కడ చెట్ల కింద సేద తీరుతూ కవిత్వం రాస్తూ… ప్రకృతిని ఆరాధిస్తాడట. ప్రకృతి అంటే అంత ఇష్టం కాబట్టే.. దాన్ని రక్షించడానికి తన వంతు సాయంగా సొంత డబ్బులతో మొక్కలు నాటుతున్నాడట.
అయితే.. నీలగిరి ఫారెస్ట్లో రోజు రోజుకు చెట్లను నరికి కలపను ఎత్తుకెళ్లే ముఠా ఎక్కువవడంతో.. ముఠాను దైర్యంగా ఎదుర్కొని వాళ్లకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయడంలోనూ ప్రముఖ పాత్ర పోషించాడు యోగనాథన్. ఇక.. అప్పుడే తనకు ఎంతో ఇష్టమైన ప్రకృతిని కాపాడుకోవడం కోసం మొక్కలు నాటాలని నిశ్చయించుకున్నాడట. అందుకే.. అప్పటి నుంచి తనకు వచ్చే శాలరీలో 40 శాతం డబ్బులతో మొక్కలు కొని నాటుతాడట.
అంతే కాదు.. స్కూళ్లు, కాలేజీలకు అప్పుడప్పుడు వెళ్లి విద్యార్థులకు పర్యావరణ ప్రాముఖ్యాన్ని తెలియజేస్తాడట. అందుకే ఈయనను అక్కడివారంతా ట్రీ మ్యాన్ అని ముద్దుగా పిలుస్తారట.
ఇక.. పర్యావరణ పరిరక్షణ కోసం తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్న యోగనాథన్ గురించి తెలుసుకున్న నిజామాబాద్ ఎంపీ కవిత..యోగనాథన్ గురించి ట్వీట్ చేసిన ఓ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ట్వీట్ను రీట్వీట్ చేశారు.