కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుతో లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలు లభిస్తా యని సీఎం కేసీఆర్ అన్నారు .వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ … ఈ ఒక్క రోజే 22 సంస్థలు ఒప్పందం చేసుకున్నాయి. పారిశ్రామికవేత్తలు రాష్ట్రప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం సంతోషాన్నిస్తుందన్నారు. ఈ ఒప్పందాల వల్ల 3,900 కోట్ల రూపాయాల పెట్టబుడులు రానున్నాయని తెలిపారు సీఎం. ఈ రోజు జరిగిన ఒప్పందాలతో 27 వేల మందికి ప్రత్యక్ష ఉపాధి, 50 వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ఇతర రాష్ర్టాల్లో ఉన్న మన నేతన్నలు.. తిరిగి రాష్ర్టానికి రావాలని కోరుతున్నానని పేర్కొన్నారు. భూములు కోల్పోయిన ప్రతీ ఒక్కరికి ఉద్యోగం వచ్చే అవకాశం ఉందన్నారు. నిర్వాసితులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు.
టీఎస్ ఐపాస్ ద్వారా అద్భుతం జరిగింది
స్వర్గీయ జయశంకర్ సార్, తాను కలిసి తెలంగాణ ధనిక రాష్ట్రమైతది అని పలు సభల్లో చెప్పామని సీఎం గుర్తు చేశారు. ఆనాడు చెప్పిన విధంగానే తెలంగాణ ఇప్పుడు ధనిక రాష్ట్రమైందని స్పష్టం చేశారు. టీఎస్ఐపాస్ ద్వారా ఇవాళ ఒక అద్భుతం జరిగింది. పదిహేను రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. 5,017 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వడం జరిగిందన్నారు. అవినీతికి తావు లేకుండా పరిశ్రమలకు అనుమతులు ఇచ్చామన్నారు. ఇప్పటి వరకు టీఎస్ఐపాస్ విధానం ద్వారా ఒక లక్షా ఏడు వేల కోట్ల పెట్టుబుడులు వచ్చాయి. కొత్త రాష్ట్రమైనప్పటికీ అభివృద్ధిలో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం, అధికారులు చిత్తశుద్ధితో పని చేయడం వలన ఇదంతా సాధ్యమవుతుందన్నారు సీఎం కేసీఆర్.