భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్క్కు శంకుస్థాపన చేయించుకున్నందుకు వరంగల్ ప్రజల అందరిని అభినందిస్తున్నానని సీఎం కేసీఆర్ అన్నారు.వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇవాళ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం జరిగే రోజుల్లో మన వరంగల్ చుట్టుపక్కల ఉండే వర్ధన్నపేట, పరకాలతో పాటు ఇతర నియోజకవర్గాల ప్రజలు సోలాపూర్, భీవండి, సూరత్తో పాటు పలు ప్రాంతాలకు వెళ్లారని గుర్తు చేశారు. అక్కడికి వలస వెళ్లిన వారు కూడా టీఆర్ఎస్కు మద్దతిస్తూ.. ఉద్యమం చేశారు. ఉద్యమ సమయంలో వారిని పిలిచి మాట్లాడటం జరిగింది. అజంజాహీ మిల్లు మూతబడింది కాబట్టి అక్కడికి వలస వెళ్లినమని చెప్పారు. అజంజాహీ మిల్లును తలదన్నేలా వరంగల్ జిల్లాలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ రాబోతుందని ఆనాడే చెప్పాను. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. వచ్చే ఆగస్టు లోపు వరంగల్కు కాళేశ్వరం నీళ్లతో రైతులు బంగారం పండించ వచ్చని సీఎం అన్నారు. త్వరలోనే వరంగల్.. బంగారు వరంగల్ అవుతుందన్నారు. ఆ తర్వాతే బంగారు తెలంగాణ అవుతుందని సీఎం వ్యాఖ్యానించారు.