వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం శాయంపేటలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఈ రోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్ మాట్లాడుతూ …. దేశంలో ఎక్కడా లేని విధంగా 50 అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు సీఎం కేసీఆర్. కేసీఆర్ కిట్స్ను ప్రజలు బాగా ఆదరిస్తున్నారని తెలిపారు. గర్భిణులకు 12 వేల రూపాయాలు అందిస్తున్న విషయం మీకు తెలుసు. పశువుల కోసం సంచార వైద్యశాలలు ఏర్పాటు చేశాం. ఆటోలకు, వ్యవసాయ ట్రాక్టర్లకు పన్నుమాఫీ చేసిన రాష్ట్రం తెలంగాణ మాత్రమే. పేదింటి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థుల కోసం 504 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. నిరుపేద విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. రైతుల సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. ప్రపంచంలోనే మొట్టమొదటిసారి.. అసంఘటిత రంగంలో ఉన్న రైతులను సంఘటిత పరిచే విధంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. భూరికార్డుల ప్రక్షాళన చాలా విజయవంతంగా జరుగుతుందని సీఎం స్పష్టం చేశారు.
