ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రముఖ టాలీవుడ్ స్టార్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, పి.నారాయణ, ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్, అబుదాబికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త బిఆర్ షెట్టి, ఉన్నతాధికారుల బృందం లండన్ లో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే .ఈ పర్యటనలో భాగంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని భవన నిర్మాణాలకు చెందిన పలు ఆకృతులను పరిశీలించారు .
ఈ సందర్భంగా ఏపీ ప్రజలకు గర్వకారణంగా నిలిచేలా, భారతీయత ఉట్టిపడేలా, నవ్యాంధ్ర ప్రజల ఆత్మవిశ్వాసాన్ని ద్విగుణీకృతం చేసేలా, సహజ వనరుల్ని ఉపయోగించుకుని అమరావతిలో నిర్మించనున్న శాసనసభ, హైకోర్టు భవనాల ఆకృతులను రూపొందిస్తున్నామని నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు క్రిస్ బాబ్, పిడ్రో వివరించారు. ఒక్కో భవనానికి రెండేసి ఆకృతులను ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాలు, పట్టణాల నుంచి సేకరించిన మట్టిని శాసనసభ నిర్మాణంలో వినియోగించాలని, ఇలా చేస్తే తామంతా ఈ సభ నిర్మాణంలో భాగస్వాములయ్యామని గర్వపడతారని రాజమౌళి పేర్కొన్నారు. రాష్ట్ర చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా భవనాన్ని తీర్చిదిద్దాలని, సందర్శకులు వాటి ఫొటో తీసుకున్నప్పుడు వాటి చరిత్ర తెలిసేలా ఒక యాప్ను రూపొందించవచ్చని, ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా యానిమేషన్ చిత్రాలనూ ఫోన్లో తిలకించేలా చేయవచ్చని ఆయన తెలిపారు. శాసనసభ భవనం చుట్టూ నీటి కొలను ఉండటంవల్ల రాత్రిపూట, పగటిపూట అద్భుతంగా కనిపిస్తుందని ఫోస్టర్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.