ఓ ఆటో డ్రైవర్ ఉన్మాదం బొబ్బిలిలో కలకలం సృష్టించింది. ఈ సంఘటన బొబ్బిలి పరిసర గ్రామాల వారిని ఉలిక్కిపడేలా చేసింది. మార్కెట్కు వచ్చి తిరిగి వెళ్లిపోతున్న వారిని ఎక్కించుకున్న ఆటో డ్రైవర్ వారిని గమ్యానికి చేర్చకుండా వెకిలి చేష్టలతో లైంగిక దాడికి పాల్పడి కాదన్న వారిని హతమార్చే ప్రయత్నం చేయడం అందరినీ విస్మయానికి గురి చేసింది.
బొబ్బిలి మండలం కోమటిపల్లికి చెందిన ఇజ్జురోతు చిన్న, బలరాం పిల్లలయిన ఇజ్జురోతు స్వాతి, ఇజ్జురోతు పావని ఇటీవల దీపావళి పండగ సందర్భంగా స్వగ్రామానికి వచ్చారు. స్వాతికి వివాహమై ఏలూరులో ఉంటుండగా, పావని హైదరాబాద్లో ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటోంది. బుధవారం సాయంత్రం 4.30 గంటలకు ఇద్దరు అక్కాచెల్లెళ్లూ గ్రామానికి దగ్గర్లోనే ఉన్న బొబ్బిలి పట్టణానికి షాపింగ్ నిమిత్తమై వచ్చారు. షాపింగ్ పూర్తయ్యాక రాత్రి 7.15 గంటలకు ఇక్కడి చర్చి సెంటర్లో తిరిగివెళ్లిపోయేందుకు వాహనం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతలో గొల్లపల్లికి చెందిన వంజరాపు నరేష్ (35) అనే ఆటో డ్రైవర్ ఆటో ఎక్కండనడంతో మేమిద్దరమే ఉన్నాం ఆటోలో ప్రయాణికులంతా వచ్చే వరకూ ఉండాలి కదా అన్నారు. దీనికి నరేష్ లేదు నేను వెంటనే ఆటో తీస్తున్నాననడంతో ఇద్దరూ అందులో ఎక్కారు. అక్కడి నుంచి వస్తుండగా ఆటోను ఆపకుండా వెళ్లిపోవడంతో ఆటో డ్రైవర్ని చూసి భయపడ్డారు. అంతలో జగన్నాధపురం వచ్చేసరికి ఇద్దరిలో స్వాతి అనే అమ్మాయిపై లైంగిక దాడి చేయబోయాడు.
దీనికి ఆమె ప్రతిఘటించింది. దీంతో పావనిని పట్టుకోబోయాడు. ఆమె కూడా మా అన్నయ్య వాళ్లకు ఫోన్ చేస్తానని సెల్ తీయడంతో ఆగ్రహం పట్టలేక పక్కనే ఉన్న ఇనుప రాడ్తో స్వాతి తలపై రెండుసార్లు కొట్టాడు. దీంతో ఆమె ఆటోలోంచి తుళ్లిపోయింది. ఈ హఠాత్పరిణామానికి నివ్వెరపోయిన పావని ఆటోలోంచి దూకేసింది. అప్పటికే పూటుగా తాగి ఉన్న నరేష్ వీరిద్దరూ రోడ్డు పక్కన పడిపోవడంతో అక్కడి నుంచి ఆటోలో రయ్మంటూ జగన్నాధపురం వైపు దూసుకువస్తూ అక్కడి ఆంజనేయ స్వామి ఆలయాన్ని ఢీకొట్టాడు. ఈలోగా కోమటిపల్లికి చెందిన శంకరరావు ఏమైందంటూ గాయాలపాలై రోడ్డున పడి ఉన్న ఆమ్మాయిలను చూశాడు. ఆ తరువాత అదే గ్రామానికి చెందిన గణేష్ తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని అంబులెన్స్కు సమాచారమందించారు. వెంటనే బొబ్బిలి సీహెచ్సీకి తరలించగా ప్రాథమిక వైద్యం అందజేసిన వైద్యులు విజయనగరం రిఫర్ చేశారు. పావని చెప్పిన వివరాలతో పోలీసులు కేసు నమోదు చేశారు.