ప్రాణహిత ద్వారా తెలంగాణాలో ప్రాజెక్టులు నిర్మించి కోటి ఎకరాలకు సాగు నీరు అందిస్తామని రాష్ర్ట వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మెదక్ R&B గెస్ట్ హౌస్ లో మంత్రి విలేకరులతో సమావేశమై పలు విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. లక్ష యాభై వేల కోట్లతో పాలమూరు, డిండి, సీతారామ కాళేశ్వరం, భక్తరామదాస్ తదితర ప్రాజెక్టుల పనులు వేగంగా నడుస్తున్నాయని తెలిపారు. మల్లన్న సాగర్ ద్వారా హల్ది, సింగూర్, ఘనపూర్, పోచారం, నిజాంసాగర్ ఆయకట్టుకు రెండు పంటలకు సాగునీరు అందిస్తామని చెప్పారు. రైతుల కోసం కాదు రచ్చ కోసమే కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోందన్నారు. శాసనసభ వేదికగా చర్చిద్దాం అంటే బయట ప్రచారం కోసం రాజకీయ దురుద్దేశంతో ఆందోళనలు చేపడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చే యాసంగి, వానాకాలం పంటలకు ఎకరానికి పెట్టుబడిగా 8000 రూపాయలు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి త్వరలో ఏర్పటు చేసి 500 కోట్ల రూపాయలతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు గిట్టు బాటు ధర కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో 5,400 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 72 గంటల్లో కొనుగోలు చేసిన దాన్యానికి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమా చేస్తామని పేర్కొన్నారు.
