వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో రాష్ట్ర స్థాయి క్రీడలను డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్రావు, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, గురుకులాల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్తో పాటు పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. గురుకులాల్లో క్రీడలను ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. తెలంగాణ గురుకులాల అథ్లెటిక్ అకాడమీని ఏర్పాటు చేస్తామన్నారు. కార్పొరేట్ పాఠశాలల్లో బట్టీ విద్య కొనసాగుతోందన్నారు. గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు సకల సౌకర్యాలతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రభుత్వం రోజుకు ఒక్కో విద్యార్థికి రూ. 38 ఖర్చు చేస్తుందన్నారు. 125 గురుకులాలు కావాలని అడిగితే 515 గురుకులాలను సీఎం మంజూరు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు 296 గురుకుల పాఠశాలలుంటే.. తాము మూడేళ్లలో 546 గురుకులాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఉచిత విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. 2018-19 విద్యాసంవత్సరానికి గానూ రాయపర్తి గురుకుల పాఠశాల ఆవరణలో డిగ్రీ కళాశాలను ప్రారంభిస్తామని కడియం చెప్పారు.