తనకు ఎంతో గుర్తింపునిచ్చి పార్టీని తన పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఎడమ కాలితో తన్నేసి మరీ బయటకు వచ్చి కొడంగల్ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఈ సందరభంగా కూడా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మామూలు పంచ్ ఇవ్వలేదని తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సమావేశం, ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయినట్లు వార్తల నేపథ్యంపై వివరణ ఇచ్చేందుకు అంటూ చంద్రబాబుతో భేటీ అయిన సందర్భంగా ముందస్తుగా సిద్ధం చేసుకున్న మూడు పేజీల రాజీనామా లేఖ ఇచ్చేసిన సంగతి తెలిసిందే.
అయితే ఈ సందర్భంగా కూడా రేవంత్ షాక్ ఇచ్చాడని అంటున్నారు. ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో భేటీ సాకుగా చూపెట్టి తనపై పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకునే అవకాశం ఉందని రేవంత్ గ్రహించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ తరహా షాక్ ఎదురుకాకముందే రాజీనామా చేసి బయట పడ్డారని విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్ తో దోస్తీ విషయం బయటపడిన నేపథ్యంలో…ఆలస్యం చేస్తే పార్టీ క్రమశిక్షణా చర్య తీసుకోవడమో లేక పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నచ్చజెప్పడమో ఏదో ఒకటి జరుగుతుందని రేవంత్ ఊహించారు. చంద్రబాబు రేవంత్ను కూర్చోబెట్టుకుని నచ్చజెబితే, మళ్లీ ఇరకాటంలో పడాల్సి వస్తుందని ఆయన భావించారు…అందుకే ఆ అవకాశం ఇవ్వకుండా రాజీనామా చేశారని అంటున్నారు.
విలేఖరుల సమావేశం నిర్వహించిన తర్వాత మళ్లీ మాట్లాడుదామని చంద్రబాబు చెప్పినప్పటికీ అక్కడ ఏం జరుగుతోందో రేవంత్ ఊహించారని చెప్తున్నారు. ఈ ప్రెస్మీట్లో చంద్రబాబు తన పక్కనే రేవంత్ను కూర్చోబెట్టుకుని, రేవంత్ పార్టీ వీడడం లేదని, ఇప్పటి వరకు మీడియాలో వచ్చిన వార్తలన్నీ కట్టు కథలేనని చంద్రబాబు ఖచ్చితంగా చెప్పి ఉండే వారు. అప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్న రేవంత్కు మైక్ తీసుకుని ఖండించేందుకూ అవకాశం ఉండేది కాదు. ఇటువంటి పరిణామాలు ఎదురవుతాయని భావించిన రేవంత్ చాలా ఉపాయంగా, తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయం కార్యదర్శికి అందజేసి నేరుగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గానికి బయలుదేరారని…ఆ విధంగా బాబుకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారని అంటున్నారు.
Post Views: 424