చేనేత కార్మికుల రుణమాఫీని వెంటనే అమలుచేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో చేనేత, జౌళిశాఖలపై అధికారులతో మంత్రి సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.10.50 కోట్లు అవసరమవుతాయని, దీనిద్వారా 2500 మంది కార్మికులు లబ్ధిపొందుతారని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. లక్ష రూపాయల వరకు తీసుకున్న ప్రతి చేనేత కార్మికుడి రుణం మాఫీ అవుతుందన్నారు. అర్హులైనవారి తుది జాబితాను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. చేనేత, పవర్లూం కార్మికులు తీసుకున్న రుణాలను గతంలో ఎన్నడూ లేనివిధంగా మొదటిసారి మాఫీ చేస్తున్నామన్నారు. గతంలో నేతన్నలకు ప్రకటించిన పథకాలన్నీ త్వరగా అమలయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. నూలు, రసాయనాలు, రంగులపై సబ్సిడీ ఇచ్చే పథకాన్ని నవంబర్ మొదటివారంలో ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు మంత్రికి తెలిపారు. దీనిద్వారా చేనేత కార్మికులకు 40 శాతం, పవర్లూం కార్మికులకు పదిశాతం సబ్సిడీ అందుతుంది.ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలకు అనుగుణంగా హ్యాండ్లూం, పవర్లూంలకు వెంటనే ప్రత్యేక కార్పొరేషన్లను ఏర్పాటు చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రక్రియను పూర్తిచేయాలని జయేశ్రంజన్, శైలజా రామయ్యర్లకు సూచించారు. ప్రస్తుతమున్న టెస్కోను తెలంగాణ స్టేట్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్హెచ్డీసీ)గా మార్పు చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఇందుకు అవసరమైన ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
Minister @KTRTRS conducted a review meeting on Handloom and Textiles Department at Secretariat today pic.twitter.com/2bCHtOQtHs
— Min IT, Telangana (@MinIT_Telangana) October 30, 2017