తెలంగాణ రాష్ట్రంలో 98 శాతం గుడుంబాను నిర్మూలించామని ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు తెలిపారు. గుడుంబా నిర్మూలన – పునరావాసంపై శాసనసభలో లఘు చర్చ సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతామని సీఎం కేసీఆర్.. వరంగల్లో ప్రకటించిన విషయాన్ని పద్మారావు గుర్తు చేశారు. సీఎం ప్రకటన నాటి నుంచి నేటి వరకు గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపుతున్నామని మంత్రి స్పష్టం చేశారు. గుడుంబా తయారీ నిషేధంపై గతంలో చర్యలు తీసుకున్నారు.. కానీ ఫలితం లేదన్నారు. గుడుంబా నిర్మూలనకు విద్యావంతుల నేతృత్వంలో అధ్యయనం జరిగినప్పటికీ.. అధ్యయన నివేదికలను నాటి ప్రభుత్వాలు బుట్టదాఖలు చేశాయన్నారు.
కరుడగట్టిన 89 మందిపై పీడీయాక్ట్ కేసులు నమోదు చేశామన్నారు. 5,638 మందికి పునరావాసం కల్పించామన్నారు. క్షేత్రస్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. గుడి, బడి వద్ద ఉన్న వైన్షాపులను అనుమతించడం లేదన్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా కాకుండా.. కేసీఆర్ ప్రభుత్వం సంకల్పంతో పని చేస్తుందన్నారు. గుడుంబా నిర్మూలనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. ధూల్పేటలో ఖాళీగా ఉన్న 5 ఎకరాల స్థలంలో గుడుంబా తయారీ చేస్తున్న వారికి పునరావాసం కల్పించి.. వారి జీవనోపాధికి చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామన్నారు. గుడుంబా కేసులు నమోదు కానివారికి కూడా పునరావాసం కల్పిస్తామన్నారు. తొలిదశలో బైండోవర్ అయినవారికి ఉపాధి కల్పించామని గుర్తు చేశారు. ధూల్పేటకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని మంత్రి ప్రకటించారు.
గుడుంబా తీవ్రత ఎక్కువ అవుతున్న ప్రాంతాలపై దృష్టి సారించి.. గ్రామ సభల ద్వారా గుడుంబా నిర్మూలనకు చర్యలు తీసుకున్నామని స్పష్టం చేశారు. గుడుంబా నియంత్రణకు కఠినమైన చర్యలు తీసుకుంటున్నామని ఉద్ఘాటించారు. జీవనోపాధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. జీవనోపాధిలో భాగంగా కిరాణ దుకణాలు, బట్టల దుకాణాలు, గాజుల దుకాణాలు, చెప్పుల దుకాణాలతో పాటు ఇతర ఉపాధిని కల్పించామన్నారు. వీరందరికీ బ్యాంకులతో సంబంధం లేకుండా రూ. 2 లక్షల ఆర్థిక సహాయం అందజేశామని మంత్రి పద్మారావు స్పష్టం చేశారు.