వరంగల్ జిల్లా మున్సిపల్ శాఖ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం సచివాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రులు స్పందిస్తూ.. 2018 డిసెంబర్ నాటికి వరంగల్ లోని అభివృద్ధి కార్యక్రమాలు అన్ని పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వరంగల్ పర్యటనల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల అమలు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. కాగా వరంగల్ లో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి ఒక ఎస్.ఈ స్థాయి అధికారిని వరంగల్ కేంద్రంగా ఉంచాలని ఉప ముఖ్యమంత్రి కోరగా మంత్రి కేటీఆర్ సుముఖత వ్యక్తం చేశారు. అధికారులు అక్కడి ప్రజా ప్రతినిధులతో సమన్వయం చేసుకొని పనులు చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. నెలవారీ లక్ష్యాలు నిర్దేశించుకొని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, రోడ్లు, జంక్షన్లు, పార్కులు, స్మశాన వాటికలు, మార్కెట్లు, ఔటర్ రింగ్ రోడ్డు, మిషన్ భగీరథ, చెరువుల బ్యూటిఫికేషన్, మాస్టర్ ప్లాన్, నాలాల పరిరక్షణ, ఎల్.ఈ. డి లైట్స్ ఏర్పాటు, బహిర్భూమిలేని నగర ప్రకటన కసరత్తు, అక్షయ పాత్ర అమలు-కేంద్రాల పెంపు, హరితహారం లక్ష్యాల పూర్తి, స్ట్రీట్ వెండర్ పాలసి, అక్రమ లే అవుట్ల గుర్తింపు- పన్ను పరిధిలోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలు, నగరాన్ని శుభ్రంగా నిర్వహించడానికి చెత్త తరలింపు వంటి అంశాలపై మంత్రులు సమావేశంలో సవివరంగా చర్చించారు.
