గత మూడున్నర సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో యంగ్ అండ్ డైనమిక్ మినిస్టర్ కేటీఆర్ నేతృత్వంలో రాష్ట్రానికి పరిశ్రమలు , పెట్టుబడులు వేల్లువేత్తుతున్న సంగతి తెలిసిందే . ఈ క్రమంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత దేశంలో తెలంగాణ రాష్త్రం ప్రథమ స్థానం పొందింది. హరియాణా, పశ్చిమబెంగాల్ ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవగా ఆంధ్రప్రదేశ్ కి 15వ స్థానం దక్కింది. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంగళవారం తాజా ర్యాంకులను విడుదల చేసింది. ప్రపంచబ్యాంకు, కేంద్ర ప్రభుత్వం మూడేళ్ల క్రితం వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక కింద సులభతర వ్యాపార నిర్వహణపై ర్యాంకుల విధానాన్ని చేపట్టింది. పారిశ్రామిక, వాణిజ్య రంగాలతో పాటు ఇతర రంగాల్లో సంస్కరణల ప్రాతిపదికన రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తోంది.
అనుమతులు, లైసెన్సింగ్ విధానం, ప్రభుత్వ సహకారం ఇతర అంశాల ఆధారంగా ర్యాంకులను ఖరారు చేస్తున్నాయి. 2016-17లో ఏపీ, తెలంగాణలు భారీఎత్తున సంస్కరణలు చేపట్టి ఈవోడీబీ ర్యాంకుల్లో ప్రథమ స్థానంలోనిలిచాయి. 2017-18లో ర్యాంకులపై విపరీతమైన పోటీ ఏర్పడింది. 376 అంశాల ఆధారంగా ర్యాంకుల విధానం చేపట్టారు. నవంబరు ఏడో తేదీ వరకు తుది ర్యాంకులకు గడువు కాగా ఇప్పటి వరకు అమలు చేస్తున్న సంస్కరణల ఆధారంగా తాజా ర్యాంకులను కేటాయించింది.
హైదరాబాద్కు ద్వితీయస్థానం: సులభతర వాణిజ్య నిర్వహణకు సంబంధించిన ప్రపంచబ్యాంకు దేశంలోని 17 ప్రధాన నగరాలకు ప్రకటించిన ర్యాంకుల్లో హైదరాబాద్ ద్వితీయ స్థానంలో నిలిచింది. ప్రధాన స్థానం లూధియానా దక్కించుకుంది. వ్యాపారాల ప్రారంభ, భవన నిర్మాణాలకు అనుమతి, రుణసాయం, చిన్నతరహా పెట్టుబడిదారుల పరిరక్షణ, పన్నుల చెల్లింపు, సరిహద్దుల్లో వాణిజ్యం వంటి అంశాలను ఇందుకు పరిగణనలోకి తీసుకున్నారు. విద్యుత్, పన్నుల చెల్లింపు, సరిహద్దుల్లో వ్యాపార నిర్వహణకు సంబంధించిన సంస్కరణల అమలుపై ప్రపంచ బ్యాంకు అధ్యయనం చేసి ఈ ర్యాంకులను ప్రకటింంచింది. లూధియానా, హైదరాబాద్, భువనేశ్వర్, గురుగ్రామ్, అహ్మదాబాద్, దిల్లీ, జయపుర, గువాహటి, రాంచి, ముంబయి, ఇండోర్, నోయిడా, బెంగళూరు, పట్నా, చెన్నై, కోచి, కోల్కతాలు తొలి 17 స్థానాల్లో ఉన్నాయి.