మధిర నగర పంచాయితీకి కొత్త కళను అందించేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రులు కేటీఆర్ , తుమ్మల నాగేశ్వర్ రావులు తెలిపారు. ఈ రోజు హైదరాబాదులోని బేగంపేట్ క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాస్రెడ్డి , ఎమ్మెల్సీ, నగర పంచాయతీ చైర్మన్లు, వార్డు సభ్యులతో సమావేశమయ్యారు. మధిరకు కొత్త కళను అందించేందుకు రూ.15 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మున్సిపల్ శాఖ తరపున ఇవ్వనున్నట్లు ఈ సమావేశంలో మంత్రి కేటీ రామారావు ప్రకటించారు.ఈ నిధులతో ప్రజలకు అవసరమైన కనీస మౌళిక వసతుల కల్పన చేపట్టాలని కోరారు. మధిర, స్వచ్ఛ మధిర కావాలన్న లక్ష్యంతో అందరు కలిసి పని చేయాలని అధికారులను, పట్టణ ప్రజాప్రతినిధులను కోరారు.
ఇందుకోసం పట్టణంలో పారిశుద్ధ్యాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన పలు చర్యలపై చర్చించారు. పట్టణంలోని చెత్తను సేకరించి, తరలించేందుకు అవసరమైన 20 చెత్త తరలింపు వాహనాలను అందిస్తామని మంత్రి తెలిపారు. పట్టణంలో సుమారు ఐదు ఎకరాల్లో ఒక డంపింగ్ యార్డు వెంటనే ఏర్పాటు చేసుకోవాలని, ఇందుకు అవసరమైన భూసేకరణను పూర్తి చేయాలని అధికారులను కోరారు. పట్టణంలో ఉన్న 85 మంది పారిశుద్ధ్య కార్మికులతో పారిశుద్ద్య పనులను చేపట్టాలన్నారు. పట్టణాన్ని స్వచ్చ పట్టణంగా చేసేందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు సిద్ధిపేట లాంటి ఆదర్శ మున్సిపాలిటీలకు అద్యయనానికి వెళ్లమని ప్రజాప్రతిధులను ఆదేశించారు. పట్టణంలో ఒక పార్కు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పట్టణాన్ని పూర్తిస్థాయి బహిరంగ మలమూత్ర విసర్జన రహిత పట్టణంగా (ఓడిఎఫ్) ప్రకటించేందుకు అవసరమైన అన్ని మరుగుదొడ్ల నిర్మాణానికి నిధులు ఇస్తామని తెలిపారు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక మరుగుదొడ్డి ఉండాలని తెలిపారు. పట్టణంలో పూర్తిస్థాయి ఎల్ఈడీ లైట్లు బిగింపు ప్రక్రియను పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మధిరకు పూర్తికాల కమీషనర్ ను నియమించాలని మున్సిపల్ శాఖాధికారులకు అదేశాలను మంత్రి జారీ చేశారు.మున్సిపల్ శాఖ తరపున కేటాయించనున్న రూ.15 కోట్ల రూపాయల నిధుల ద్వారా చేపట్టాల్సిన కార్యక్రమాల తాలూకు ప్రతిపాదనలను వెంటనే పంపాలని అధికారులను కోరారు. పట్టణంలోని ప్రధాన రొడ్లను రోడ్లు భవన నిర్మాణాల శాఖ తరపున పూర్తి చేసేందుకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ శాఖ అధికారులకు అదేశాలు జారీ చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.15 కోట్ల నిధులతో పట్టణంలో అత్యవసరమైన రోడ్లు, స్మశాన వాటికలు, మోడల్ మార్కెట్లు వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మధిర అభివృద్ధి కోసం ఎంపీ నిధుల నుంచి నిధులను ఇస్తానని ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బాలసాని లక్మీనారాయణ, సీడ్ కార్పోరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వర్ రావు , పట్టణ చైర్ పర్సన్ నాగరాణి సుధాకర్ తదితరులు పాల్గోన్నారు.