నోరు తెరిస్తే చాలు హైదరాబాద్ను తానే అభివృద్ధి చేశానని..ప్రపంచ పటంలో పెట్టానని ప్రగల్భాలు పలికే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గాలి తీసేశారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. తన ప్రచారానికి వాస్తవానికి ఎంతో తేడా ఉందని…బీబీసీ ఇంటర్వ్యూలో మంత్రి స్పష్టం చేశారు.
గతంలో సీఎంలుగా చేసిన ఎన్టీఆర్, చంద్రబాబు వలే…హైదరాబాద్ నగరంపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ముద్ర ఏమైనా ఉండనుందా అని జర్నలిస్టుల అడిగిన ప్రశ్నకు మంత్రి కేటీఆర్ సూటిగా, ఘాటుగా స్పందించారు. ‘హైదరాబాద్ అభివృద్ధికి వ్యక్తుల ముద్ర వేయడం సరైంది కాదన్నారు. తన వల్లే ఏదో వచ్చిందంటే అది తప్పని… ప్రాంతానికి ఉండే అనుకూలత వల్ల అది సాధ్యం. ఐటీ రంగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న బెంగళూరుకు ఆ హోదాను ఎవరు తెచ్చారు? మేమేం తెచ్చాం…మావల్లే అయింది అంటూ అక్కడ ఏ ఒక్క ముఖ్యమంత్రో… మంత్రో చెప్పుకుంటున్నారా? ఆ విషయాన్ని ఈ ప్రచారం చేసుకునే నాయకులు ప్రకటించాలి. మీడియా ప్రచారం చేసుకోవడంలో చంద్రబాబు టాప్లో ఉంటారు. అందుకే ఇలాంటి ప్రశ్నలు“ అంటూ స్పందించారు.
హైదరాబాద్కు నేతల వల్ల ప్రయోజనం ఒరిగిందని తాను అనుకోనని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. “ఎవరి వల్లో హైదరాబాద్ అభివృద్ధి జరిగింది అని గ్లోబెల్స్ ప్రచారం చేస్తే ఎలా? కొందరు నాయకులు తమ ప్రచారానికి హైదరాబాద్ వాడుకున్నారు. ఇంద్రుడు, చంద్రుడు అని చెప్పుకోవడం ఆయనకు ఇష్టం. మీడియా అలాగే చేసింది. ఒకవేళ నిజంగా ఆయనకు అంత సీన్ ఉంటే…మీడియా అంత ప్రచారం చేసినప్పటికీ…2004లో హైదరాబాద్లో ఓడిపోయారు. అందులో హైటెక్ సిటీ ఉన్న శేరిలింగపల్లిలో కూడా ఓటమి పాలయ్యారు. హైదరాబాద్కు ఉన్న సహజ అనుకూలత వల్ల అభివృద్ధి తప్ప…ఎన్టీఆర్, బాబు వల్ల అంటే ఒప్పుకోను’ అని మంత్రి కేటీఆర్ తేల్చిచెప్పారు.
Post Views: 239