ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మృతి దురదృష్టకరమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేస్తున్నట్లు సీఎం తెలిపారు. భారతి మృతిపై శాసనసభలో సీఎం ప్రకటన చేశారు. ఎస్సీ వర్గీకరణ డిమాండ్ చేస్తూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఎమ్మార్పీఎస్ పిలుపునివ్వడం జరిగిందని సీఎం పేర్కొన్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం 12.40 గంటల సమయంలో హైదరాబాద్ కలెక్టరేట్ గేటు తోసుకుని.. ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారని తెలిపారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని వాహనంలో తరలించారని చెప్పారు. ఇదే సమయంలో ధర్నాలో పాల్గొన్న భారతి(40) అస్వస్థతకు గురై కలెక్టరేట్ వద్ద కూర్చుందని సీఎం తెలిపారు. దీంతో భారతిని.. పోలీసు వాహనంలో ఉస్మానియాకు తరలించారు పోలీసులు. ఆవిడ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటన వీడియో ఫుటేజినీ ప్రభుత్వం పరిశీలించిందని సీఎం పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారని స్పష్టం చేశారు.
భారతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా
భారతి కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఆమె కుటుంబానికి రూ. 25 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తున్నట్లు సీఎం ప్రకటన చేశారు. ఆమె కుటుంబంలో ఉద్యోగానికి అర్హులైన వారు ఉంటే.. తప్పకుండా ఉద్యోగం ఇస్తామని సీఎం స్పష్టం చేశారు. ఒక వేళ చిన్న పిల్లలు ఉన్నట్లు అయితే.. వారికి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు సీఎం.
త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తా
ఎస్సీ వర్గీకరణపై త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. వర్గీకరణకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని సీఎం ఉద్ఘాటించారు. సంతకాలను సేకరించి.. ఎస్సీ వర్గీకరణపై లేఖను రేపు లేదా ఎల్లుండి ప్రధాని మోదీకి పంపుదామని తెలిపారు. మోదీ సమయాన్ని కోరి.. త్వరలోనే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పారు