తెలంగాణలో అల్లకల్లోలం అయిపోయిన తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చేరడం ద్వారా హల్ చల్ చేసి సునామీ సృష్టించాలని ఆకాంక్షించిన టీడీపీ మాజీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి ఆదిలోనే చుక్కలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చేరికలకు ముందు హామీ ఇచ్చినట్లు పదవి కట్టబెట్టకపోగా…మరోవైపు ఆయన గాలి తీసేసేలా..కాంగ్రెస్ సీనియర్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేత జానారెడ్డి రేవంత్ కలలను చిదిమేసేశారు.
కాంగ్రెస్ పార్టీలోకి బాహుబలి వస్తాడని గతంలో వ్యాఖ్యానించిన జానారెడ్డి తాజాగా రేవంత్ ఎంట్రీపై మళ్లీ రియాక్టయ్యారు. కాంగ్రెస్లోకి రేవంత్ ఎంట్రీ గురించి ప్రస్తావిస్తూ…బాహుబలులు ఇప్పటికే వచ్చారని…. ఇంకా వస్తారని చెప్పుకొచ్చారు. సినిమాలో వచ్చే బాహుబలి కాదు…ఇంకెంత మంది బాహుబలులు వస్తారో మీరే చూస్తారని జానారెడ్డి నర్మగర్భ వ్యాఖ్యాలు చేశారు. తద్వారా రేవంత్ ఏదో పెద్ద తోపు అన్నట్లుగా కాదని తేల్చిపారేశారు.
ఇక రాష్ట్ర రాజకీయాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్కు గెలుపు చాన్స్ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఉందని జానారెడ్డి తనకు తాను ధైర్యం చెప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల కరెంటుపై మాత్రం జానారెడ్డి స్పందించకపోవడం గమనార్హం.