తెలంగాణ రాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. త్వరలోనే భూముల లెక్కలకు ముగింపు పలకబోతున్నామని సీఎం ఉద్ఘాటించారు. భూముల లెక్కలు తీయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నందునే.. భూరికార్డుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టామని సీఎం తెలిపారు.
శాసనసభలో భూరికార్డుల ప్రక్షాళనపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. భూరికార్డుల ప్రక్షాళనపై అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం కాదని సీఎం స్పష్టం చేశారు. భూరికార్డుల ప్రక్షాళనపై సుమారు 30 నుంచి 40 సమావేశాలు ఏర్పాటు చేసి సమీక్షించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. నూటికి నూరు శాతం పారదర్శకతతో భూరికార్డుల ప్రక్షాళన జరుగుతుందన్నారు.
అయితే ,ఇప్పటి వరకు జరుగుతున్న ప్రక్షాళనలో రెండు భాగాలుగా ప్రక్షాళన జరగుతుందని సీఎం చెప్పారు. ఒకటి.. భూములకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు, ఫారెస్ట్, కోర్టు పరిధిలో ఉన్న భూముల జోలికి పోవద్దని అధికారులకు సూచించామని ముఖ్యమంత్రి తెలిపారు. రెండోది.. కుటుంబ సభ్యుల మధ్య భూవివాదాలు ఉండే వాటి వద్దకు వెళ్లడం లేదు అధికారులు అని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరికీ ఆమోదయోగ్యంగా ఉండే భూములను ప్రక్షాళన చేయమని అధికారులకు సూచించామని ముఖ్యమంత్రి ఈ రోజు అసెంబ్లీ లో జరిగిన చర్చ కార్యక్రమంలో తెలిపారు.