అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తొమ్మిదో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ మధుసూదనాచారి, శాసనమండలిని ఛైర్మన్ స్వామిగౌడ్ ప్రారంభించారు.శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ఎస్సారెస్పీ పునరుజ్జీవ పథకంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్రావు సమాధానం ఇచ్చారు.
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునరుజ్జీవానికి రూ.1,067 కోట్ల పరిపాలన అనుమతులకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని మంత్రి హరీష్రావు స్పష్టం చేశారు. ఈ పునరుజ్జీవ పథకం పూర్తికి 18 నెలలు టార్గెట్ పెట్టుకున్నప్పటికీ.. సంవత్సర కాలంలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వచ్చే జూన్, జులై నాటికి రైతులకు నీరందిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అతి తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పనులు పూర్తి చేస్తామన్నారు.12 మీటర్ల లిఫ్ట్ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని వరద కాలువ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని తీసుకుపోతామన్నారు. దీని ద్వారా ఎస్సారెస్పీ రైతాంగం రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుందన్నారు. ఎస్సారెస్పీ కాల్వలను ఆధునీకరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎస్సారెస్పీ కింద చివరి ఆయకట్టు వరకు సాగునీరిస్తామని మంత్రి ఉద్ఘాటించారు.