తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశంసలు వర్షం కురిపించారు .ఇవాళ శాసనసభ లో మైనార్టీల సంక్షేమంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఎమ్మెల్యే ఓవైసీ మాట్లాడారు. అనంతరం అయన మాట్లాడుతూ ..కేసీఆర్ దృష్టిలో ఏ కులమైనా.. ఏ మతమైనా సమానమే అని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. కేసీఆర్ అందరినీ సమానంగా చూస్తున్నారని కొనియాడారు. కేసీఆర్ స్థాయికి ముఖ్యమంత్రి పదవి చాలా చిన్నదని పేర్కొన్నారు. 2019లో టీఆర్ఎస్ మాత్రమే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్కు జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే పునరావృతమవుతాయన్నారు. మైనార్టీల సంక్షేమానికి సీఎం నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.
ఉమ్మడి ఏపీలో మైనార్టీలు బడ్జెట్ కోసం పోరాటం చేశారన్నారు. ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదన్నారు. ముస్లింల అభివృద్ధికి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఉద్ఘాటించారు. కేసీఆర్ వచ్చాకే ఫీజురియింబర్స్మెంట్ విషయంలో ముస్లిం విద్యార్థులకు న్యాయం జరిగింది. షాదీముబారక్ స్కీం తెచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు ఓవైసీ. 70 ఏళ్లుగా కాంగ్రెస్ చేసిందేమీ లేదని ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు ఇచ్చింది వైఎస్ మాత్రమేనని చెప్పారు. మజ్లిస్ ఒత్తిడితోనే అప్పుడు వైఎస్ నిర్ణయం తీసుకున్నారని గుర్తు చేశారు.పూజారులను ఎంత గౌరవిస్తారో అదే స్థాయిలో ముస్లిం, క్రిస్టియన్ల మత పెద్దలను కూడా గౌరవిస్తారని తెలిపారు. గత ప్రభుత్వం ఇమామ్, మౌజంల గురించి ఆలోచించలేదన్నారు. తొలిసారిగా ఇమామ్, మౌజంలకు రూ. వెయ్యి జీవనభృతి అందించడం గొప్ప విషయమని కితాబిచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మైనార్టీ విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ను సీఎం ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ తప్ప ఏ ప్రభుత్వమూ ముస్లిం, మైనార్టీలను పట్టించుకోలేదని స్పష్టం చేశారు ఓవైసీ.