హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ ఇచ్చిన స్టేను రద్దు చేస్తూ ఉమ్మడి హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఈ వ్యవహారంలో ఎన్జీటీ తిరిగి ఉత్తర్వులు వెలువరించేదాకా, లేదంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పర్యావరణ అనుమతులు పొందేదాకా రిజర్వు అటవీ ప్రాంతంలోకి వెళ్లరాదనీ, ఒక్క చెట్టునూ కూల్చడానికి వీల్లేదని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ప్రస్తుతం కచ్చితంగా తాగునీటి అవసరాల నిమిత్తం చేపట్టే పనులకే పరిమితం కావాలంది.
పైన పేర్కొన్న వాటిని ప్రభుత్వం ఉల్లంఘించినట్లయితే ఎన్జీటీ లేదంటే ఈ హైకోర్టు దృష్టికి తీసుకురావచ్చంటూ ఫిర్యాదుదారు అయిన హయతుద్దీన్కు సూచించింది. ఉల్లంఘనలు ఏవైనా ఉన్నట్లు తేలితే ఇతర అంశాలతో సంబంధం లేకుండా తాగునీటి అవసరాలతో సహా అన్ని పనులను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ చేయవచ్చని ఎన్జీటీకి సూచించింది. తెలంగాణ ప్రభుత్వం లేవనెత్తిన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విచారణ చేపట్టి తాజాగా ఉత్తర్వులు వెలువరించాలంటూ కేసును ఎన్జీటీకే తిప్పి పంపింది.