తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్, తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పట్టుదలతో ఇంటింటికీ ఇంటర్నెట్ను అందించేందుకు విజయవంతంగా తాము ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తెలిపారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ భారత్ నెట్ ఫేజ్ 2 కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రి మనోజ్ సిన్హా అధ్యక్షతన జరిగిన కార్యక్రమం కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, ప్రకాశ్ జవడేకర్, పలు రాష్ట్రాల ఐటీ మంత్రులు, అధికారులురాష్ట్రం నుంచి ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అతివేగమైన నెట్ సదుపాయాలను కల్పించేలా వివిధ రాష్ట్రాలతో కేంద్ర టెలికమ్యూనికేషన్ మంత్రిత్వ శాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. భారత్ నెట్ పై కేంద్ర ప్రభుత్వంతో ఎంఓయూ కుదుర్చుకున్నామని ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. రాష్ట్రంలో భారత్ నెట్ కార్యక్రమాన్ని వినూత్నంగా చేపడుతున్నామని వివరించారు. భారత్ నెట్ పై కేంద్ర ప్రభుత్వం లోతైన అధ్యాయనం చేసిన తర్వాత, ఈ మోడల్ కి అంగీకారం తెలిపిందన్నారు. భారత్ నెట్ పథక అమలుకు మొదటి ఫేస్ లో భాగంగా 12 వందల 31 కోట్ల నిధులను కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసిందని వివరించారు. మిషన్ భగీరథతో సంయుక్తంగా భారత్ నెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని జయేశ్ రంజన్ వివరించారు. గతంలో ఈ మోడల్ నెట్ లపై ప్రభుత్వానికి నమ్మకం లేదన్నారు. కానీ, ప్రస్తుతం ప్రతి రాష్ట్రానికి అవసరమున్న విధంగా నెట్ సౌకర్యాన్ని కల్పించుకునే అవకాశం కల్పించిందన్నారు. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటికి నెట్ సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టిందని జయేష్ రంజన్ పేర్కొన్నారు.
ఇంటింటికి నెట్ సదుపాయం కల్పించేలా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పోరేషన్ ను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఐటీ శాఖ డైరెక్టర్ సుజయ్ కారంపురి తెలిపారు. మిషన్ భగీరథలో భాగంగా వేసే పైప్ లైన్లతోనే ఫైబర్ గ్రిడ్ కేబుల్స్ ను వేస్తున్నామని పేర్కొన్నారు. 47 వేల ఇండ్లకు ఈ పథకంలో భాగంగా నెట్ కనెక్షన్ ఇవ్వనున్నామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన నెట్ అందివ్వాలన్న లక్ష్యాన్ని మన రాష్ట్రం ఈ గ్రిడ్ ద్వారా సాధించనుందని సుజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం భారత్ నెట్ లో భాగంగా నిధులు కేటాయించక ముందే గ్రామీణ ప్రాంతాలకు నెట్ వేసే ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. 26 వేల కిలోమీటర్ల మేర ఇప్పటికే పనులను పూర్తి చేశామని సుజయ్ వివరించారు.