గులాబీ దళపతి, తెలంగాణ సీఎం కేసీఆర్ సేవా తత్పరతకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఫిదా అయ్యారు. ఉదాత్తమైన గుణంతో కేసీఆర్ స్పందించారని ఆయన కొనియాడారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో వెల్లడించారు. మహారాష్ట్రలోని నాగపూర్లో మెట్రోను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే అక్కడ రైళ్లు అందుబాటులో లేవు. మరోవైపు ట్రయల్ రన్కు గడువు సమీపిస్తోంది.
దీంతో మహారాష్ట్ర సీఎం మదిలో తెలంగాణ సీఎం కేసీఆర్ మెదిలారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్కు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఫోన్ చేశారు. తమ ఇబ్బందిని వెల్లడించారు. దీంతో రెండు బోగీలను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రకు పంపించింది. తద్వారా మహారాష్ట్ర సర్కారు తమ మెట్రో ట్రయల్ రన్ ప్రారంభించింది.
ఇదిలాఉండగా..మెట్రో ప్రారంభం విషయంలో మంత్రి కేటీఆర్ ఈ రోజు అసెంబ్లీలో వివరణ ఇచ్చారు. మన దేశానికి చెందిన ఎల్ఆండ్టీ ఈ ప్రాజెక్టును పూర్తిచేసినందునే ప్రధానమంత్రితోనే మెట్రో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోను పూర్తి స్థాయిలో నడిపించేందుకు 57 రైళ్లు అవసరమని…అన్ని రైళ్లు కూడా వచ్చాయన్నారు. అన్ని రకాలుగా, అన్ని హంగులతో ప్రారంభానికి మెట్రో సిద్ధమైందన్నారు.