శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా బ్యాంకులు మరియు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ సమాధానం ఇచ్చారు.ప్రజా ప్రయోజనాల కోసమే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేస్తుందని మంత్రి ఈటల స్పష్టం చేశారు. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది అనడం తప్పు అని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని విధాలా అభివృద్ధి చేసుకునేందుకే అప్పులు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యాలు మారుతున్నాయి కాబట్టే ప్రభుత్వం అప్పులు తీసుకుంటుందన్నారు. మారిన పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వాలు మారాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడే రాష్ర్టాలు కానీ, దేశం కానీ అభివృద్ధి చెందుతుందన్నారు. అభివృద్ధి జరగకపోతే.. కరువులు, ఆత్మహత్యలు, అవే ఆకలిచావులు ఉంటాయి తప్ప ఏమి జరగదన్నారు. తెలంగాణ ప్రజలను ఈ దేశంలో గొప్ప పౌరులుగా, గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు.అందరం కలిసికట్టుగా బంగారు తెలంగాణను నిర్మించుకుందాం అని మంత్రి ఈటెల అన్నారు . రూ. 40 వేల కోట్లతో ఇంటింటికీ మంచినీరు ఇవ్వబోతున్నామని తెలిపారు. అప్పులు ఇష్టారీతిన తీసుకునే అధికారం రాష్ర్టాలకు లేదని మంత్రి స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో అప్పులు చేసిన దేశంగా జపాన్ అగ్రస్థానంలో ఉండగా.. అమెరికా, ఫ్రాన్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయని చెప్పారు ఈటల రాజేందర్.
