తెలంగాణలో లక్ష ఉద్యోగాల భర్తీ చేస్తామన్న ముఖ్యమంత్రి హామీ మేరకు చేపడుతున్న ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు మంత్రులు కే తారకరామారావు, లక్ష్మారెడ్డిలు ఈరోజు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణితో సచివాలయంలో సమావేశం అయ్యారు. నిన్న సిటీ సెంట్రల్ లైబ్రరీలో విద్యార్థులతో మాట్లాడిన సందర్భంగా లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపినట్లు మంత్రి కే తారకరామరావు అన్నారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ ద్వారా జారీ చేసిన నోటిఫికేషన్లు, భర్తీ ప్రక్రియను మంత్రి తెలుసుకున్నారు.
ఇప్పటిదాకా సుమారు 29500 ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు విడుదల చేసినట్లు చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఇందుకోసం టీఎస్పీఎస్సీ ఇప్పటి వరకు సుమారు 75 నోటిఫికేషన్లు విడుదల చేసినట్లు తెలిపారు. వీటిలో సుమారు 23400 ఉద్యోగాలకు పరీక్షలు పూర్తిచేసినట్లు మంత్రికి తెలిపారు. దీంతోపాటు సుమారు 18 పరీక్షలకు చెందిన డాటా ప్రాసెసింగ్ ప్రస్తుతం సీజీజీ వద్ద కొనసాగుతున్నట్లు తెలిపారు. త్వరలోనే మరిన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రులకు చైర్మన్ తెలిపారు. ఈ సందర్భంగా టీఎస్పీఎస్సీ చేపట్టిన పలు సంస్కరణలు దేశంలోని పలు రాష్ర్టాల కమీషన్లు అదర్శంగా తీసుకుంటున్నాయని చైర్మన్ తెలిపారు.
సర్వీస్ కమీషన్తో పాటు పోలీస్, విద్యుత్ శాఖ మొదలయిన శాఖల ద్వారా లక్ష ఉద్యోగాల భర్తీ అవుతాయని మంత్రి కే తారకరామారావు తెలిపారు. టీఎస్పీఎస్సీ పారదర్శకంగా పనిచేస్తుందన్న మంత్రి, కమిషన్ బలోపేతానికి మరిన్ని చర్యలు తీసుకుంటామన్నారు. సర్టిఫికేట్ల వెరిఫికేషన్, డాటా ప్రాసెసింగ్ వంటి ప్రక్రియలను మరింత వేగంగా పూర్తి చేసేందుకు అవసరం అయిన ఐటీ సెంటర్ ఏర్పాటు కోసం అవసరం అయిన భవన సదుపాయాన్ని కల్పిస్తామన్నారు. ఈ మేరకు తమ శాఖ పరిధిలో ఉన్న పలు భవనాలను మంత్రి అదేశాల మేరకు అధికారులు కమీషన్ చైర్మన్ కు చూపించారు. త్వరలోనే ఈ ఐటి సెంటర్ పూర్తి చేసేందుకు ఐటీ శాఖ పరిధిలోని టీఎస్టీఎస్ ద్వారా సహకారం అందిస్తామన్నారు.
Post Views: 722