తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని హైటెక్ సిటీ కి నెల రోజుల క్రితం వెళ్ళితే ఇది నిజంగానే హైటెక్ సిటీ అని అనుకునేవారు ఇప్పుడు వెళ్ళితే వారు ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే.. తప్పక అవుతారు .అవును ఇది అక్షరాల నిజం .ఎందుకంటే మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలిలోని మెయిన్ రోడ్లు ఇప్పుడు తళుక్కుమంటున్నాయి. ఎటు చూసినా పచ్చదనం.. ఎటు చూసినా రంగు రంగుల బొమ్మలు. రోడ్లు అయితే అబ్బో హైదరాబాద్ అన్ని రోడ్లు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో అని అనుకోని వాహనదారుడు ఉండడు.వారం రోజుల్లో జరగబోతున్న గ్లోబల్ ఎంట్రప్రెన్యూషిప్ సమిట్ కు.. ఏర్పాట్లు వేగంగా జరగుతున్నాయి. GHMC అధికారులు, సిబ్బంది రాత్రి పగలు పని చేస్తున్నారు. అయితే.. ఈ పనుల్లో కాలేజీ స్టూడెంట్స్ కూడా భాగస్వామ్యం అయ్యారు.
HICC దగ్గర పూల కుండీలపై స్టూడెంట్స్ పెయింటింగ్స్ వేస్తున్నారు. 28న జరిగే GES సదస్సుకు.. ప్రధాని మోడీతో పాటు ఇవాంక ట్రంప్ వస్తుండటంతో మినీ చార్మినార్ నుంచి HICC వరకూ పచ్చదనంతో నిండిపోయింది. కిలోమీటర్ ఉన్న ఈ రూట్.. పచ్చని మొక్కలు, ట్రీస్ పెయింటింగ్స్, బెంచీలు, పూల కుండీలతో దారంతా ఆహ్లాదకరంగా మారింది.సదస్సుకు మరికొన్ని రోజులే ఉండడంతో పనులు స్పీడప్ చేసింది బల్దియా. జాహ్నవి కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈ పనుల్లో భాగమయ్యారు. వీరంతా డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. 60 మందికి పైగా విద్యార్థులు.. పూల కుండీలకు పెయింట్స్ వేస్తున్నారు. కిలోమీటర్ పొడవునా ఉన్న 500 కుండీలను అందంగా తీర్చిదిద్దుతున్నారు ఆర్కిటెక్చర్ స్టూడెంట్స్. ప్రకృతి మరింత అందంగా కనిపించడానికి.. నేచర్ పెయింటింగ్సే కారణమంటున్నారు విద్యార్థులు. గ్రౌండ్ లో వర్క్ నేర్చుకోవడంలోనే థ్రిల్ ఉందంటున్నారు. వీళ్ళంతా నాలుగు రోజులుగా పనిచేస్తున్నారు. రెండు రోజుల్లో వర్క్ పూర్తి చేస్తాం అంటున్నారు.ఈ ప్రాంతంలో ఎక్కడా ఖాళీ లేకుండా అద్బుతమైన బొమ్మలను తీర్చిదిద్దారు. ఫ్లైఓవర్ ను ఇంత అందంగా ఎప్పుడూ చూడలేదని వాహనదారులు అంటున్నారు. వీళ్లందరూ కూడా స్టూడెంట్సే. ఇక చెట్లకు కూడా కలర్స్ వేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు.