వైసీపీ నుండి టీడీపీలోకి చేరిన కొద్ది సేపటికే గిడ్డి ఈశ్వరి టీడీపీకి షాక్ ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సోమవారం టీడీపీలో చేరిన గిడ్డి ఈశ్వరి.. మీడియాతో మాట్లాడుతూ డ్యామ్షూర్ పాడేరు, అరకు నియోజకవర్గాల్లో వైసీపీనే విజయం సాధిస్తుందని చెప్పి టీడీపీ వర్గీయులకు షాక్ గురిచేశాయి.
అంతే కాకుండా నాకు రాజకీయ భిక్ష పెట్టింది జగన్. ఓ గిరిజన మహిళ అయిన నేను ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యానంటే కారణం జగన్. అందుకే నాకు ఆయన ఇష్టం.. ప్రాణం. మనసు చంపుకొని ఇప్పుడు నేను టీడీపీలో చేరాను. విశాఖలో మొత్తం 15 నియోజకవర్గాల్లో ఉంటే.. గత ఎన్నికల్లో అరకు, పాడేరులో వైసీపీ అధిక మెజారిటీతో విజయం సాధించిందని తేల్చి చెప్పింది.
గతంలో బాక్సైట్ తవ్వకాలు చేస్తే సీఎం తలనరుకుతా అన్న వ్యాఖ్యల గురించి మీడియా ప్రశ్నించగా..తాను అప్పట్లో సీఎంను అనలేదని..ఇప్పటికీ ఎవరైనా బాక్సైట్ జోలికొస్తే అదే మాటకు కట్టుబడి ఉంటానని వ్యాఖ్యానించారు. ఆమె సీఎంపైనే విమర్శలు చేశారని అప్పట్లో టీడీపీ నేతలు గిడ్డి ఈశ్వరి పై కేసులు కూడా పెట్టారు.అయితే ఇప్పుడు ఏకంగా ఆమె టీడీపీలో చేరిపోయారు. ఇక గిడ్డి ఈశ్వరి మాట్లాడుతున్న సమయంలో విశాఖ జిల్లా రూరల్ టీడీపీ అధ్యక్షుడు పంచకర్ల రమేశ్బాబు అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. మొత్తం మీద టీడీపీలో చేరిన తర్వాత కూడా వైసీపీ గెలుస్తుందని ఆమె చేసిన వ్యాఖ్యలతో ఆమె వెంట ఉన్న నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు.