నవంబర్ 29.. మలిదశ ఉద్యమంలో మరో ప్రస్థానం.. అత్యంత కీలకమైన రోజు.. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు..ఇదే రోజు.. సరిగ్గా ఎనిమిదేండ్ల క్రితం.. ఉద్యమ నాయకుడిగా నేటి ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో మృత్యువును ముద్దుపెట్టుకునేందుకు సంకల్పించిన రోజు! తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.. అనే అంతిమ నినాదంతో కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన సమయం! దేశచరిత్రలోనే మైలురాయిగా నిలిచిన ఆ ఆమరణ దీక్ష.. ఆరు దశాబ్దాల స్వప్నాన్ని సాకారంచేస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వంతో ప్రకటన చేయించింది! జాతిపిత మహాత్మాగాంధీ చూపిన అహింసామార్గంలో ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్.. చివరకు తన ప్రాణాలను పణంగా పెట్టి.. డిసెంబర్ 9 ప్రకటనను సాధించారు. నేటి తెలంగాణ రాష్ర్టానికి ఆలంబనగా నిలిచిన నాటి త్యాగఫలాన్ని ఒకసారి మననం చేసుకుందాం..
2009..! దశాబ్దాల అలుపెరుగని రాష్ట్రసాధన సమరం చావోరేవో తేల్చుకునేందుకు సంసిద్ధంగా ఉన్న సమయమది! పదునాల్గేండ్ల రాష్ట్ర సాధన ఉద్యమం.. పురుటినొప్పులు పడుతున్న తరుణమది! ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను తునాతునకలు చేసేందుకు కుట్రకత్తులు విచ్చుకుని వికటాట్టహాసాలు చేస్తున్న దశలో.. వాటిని ధిక్కరించిన ఒక స్వరం.. దీక్షాస్త్రంతో తుది సమరానికి శంఖం పూరించింది! ఉద్యమాల గడ్డ కరీంనగర్ వేదికగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆమరణదీక్షకు సిద్ధమయ్యారు. అప్పటికి కరీంనగర్ ఎంపీగా ఉన్న కేసీఆర్.. సరిగ్గా ఇదే రోజు సిద్దిపేటలో ఆమరణదీక్ష చేసేందుకు కరీంనగర్ జిల్లా కేంద్రం నుంచి భారీ ర్యాలీగా బయల్దేరారు. మేము సైతం అంటూ ఆనాడు పోటెత్తిన ప్రభంజనాన్ని చూసి.. నాటి కాంగ్రెస్ పాలకులు బెంబేలెత్తిపోయారు. కేసీఆర్ ఆమరణ దీక్ష సృష్టించే ప్రళయాన్ని ముందే పసిగట్టిన పాలకులు.. ఆ మహత్తర పోరాటాన్ని అణిచివేసేందుకు కుయుక్తులు పన్నారు. ఫలితంగా.. కరీంనగర్ శివారు ప్రాంతమైన అలుగునూరు గ్రామం వద్ద పోలీసుల భారీ డ్రామా! ఉద్యమ నేత కేసీఆర్ అరెస్ట్!! బలవంతంగా అరెస్టు చేసిన కేసీఆర్ను ఎక్కడికి తీసుకుపోతున్నారో తెలియని అయోమయ పరిస్థితి! చివరకు ఖమ్మంలోని జిల్లా కేంద్ర కారాగారానికి తరలించారు. తన అక్రమ అరెస్టును ఖండించిన కేసీఆర్.. తెలంగాణ సాధించే వరకు ముద్ద ముట్టేది లేదంటూ జైల్లోనూ పంతంపట్టారు. నాటి కేసీఆర్ అకుంఠిత దీక్ష.. యావత్ రాష్ట్రంలో కలకలం రేపింది. తెలంగాణలో కేసీఆర్కు మద్దతుగా యువత పెద్దఎత్తున నిరసనలకు, ఆందోళనలకు దిగారు. ఉధృత ఉద్యమంతో పదిజిల్లాలు అట్టుడికిపోయాయి.
శ్రీకాంతాచారి ఆత్మాహుతి
ఉద్యమనేత అరెస్టుతో తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.. యువతలో భావోద్వేగాలు పెచ్చరిల్లాయి! అమాయక ప్రాణాలు బెంగటిల్లాయి! తెలంగాణ రాదేమోనన్న బాధతో ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన శ్రీకాంతాచారి.. హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతంలో ఆత్మాహుతికి పాల్పడ్డాడు! ఈ ఘటనలతో తెలంగాణ ఉద్యమం ఉప్పెనయ్యింది. ఎక్కడ చూసినా కేసీఆర్ అరెస్టు ముచ్చటే! ఎటు చూసినా.. ఆంధ్రపాలకుల నిరంకుశత్వంపై ధర్నాల వెల్లు వే! యువత, విద్యార్థులు రోడ్లమీదకు వచ్చారు. ఉద్యోగ సంఘాలు పెన్డౌన్కు పిలుపునిచ్చా యి.. ఇలా పది జిల్లాల్లో ఉద్యమం రాజుకుంది. జై తెలంగాణ నినాదం మారుమోగింది.
ఖమ్మం నుంచి నిమ్స్లో…
ఖమ్మం జైల్లో దీక్ష కొనసాగిస్తున్న కేసీఆర్ ఆరోగ్యం క్షీణించింది. దీనిని గమనించిన వైద్యులు వెంటనే మెరుగైన వైద్యం అం దించాలని సూచించడంతో నాటి ప్రభు త్వం హైదరాబాద్లోని నిమ్స్ హాస్పిటల్కు కేసీఆర్ను తరలించింది. నిమ్స్లోనూ కేసీఆర్ వైద్యచికిత్సలు చేయించుకోలేదు. తెలంగాణకోసం ప్రాణాలైనా అర్పిస్తానని భీష్మించారు. నానాటికీ ఆరో గ్యం క్షీణిస్తూ.. పరిస్థితి ప్రమాదకరంగా మారడంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు, తెలంగాణ ప్రజాసంఘాలు, పలు రాజకీ య పార్టీల నేతలు దీక్ష విరమించి, ఆరోగ్యం కాపాడుకోవాలని కేసీఆర్కు సలహా ఇచ్చారు. లెక్క చేయని కేసీఆర్.. నిమ్స్లో వైద్యాన్ని నిరాకరించి దీక్ష కొనసాగించారు.
డిసెంబర్ 9న ప్రకటన
వైద్యానికి పూర్తిగా నిరాకరించడంతో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. ప్రాణాపాయ స్థితికి వచ్చినట్టు వైద్యులు ప్రకటించారు. దీంతో రాష్ట్రమంతా ఉద్వేగభరితమయ్యింది. ఆందోళన నెలకొని.. ఉద్రిక్తతకు దారితీసింది. కేంద్ర ప్రభుత్వానికి కూడా నిఘా సంస్థలు ఈ విషయాన్ని చేరవేశాయి. పరిస్థితి చేయిదాటేలా ఉండటంతో నాటి కేంద్ర హోం మంత్రి పీ చిదంబరం.. అత్యవసరంగా డిసెంబర్ 9, 2009న రాత్రి 10.30 గంటలకు చారిత్రాత్మక ప్రకటనచేస్తూ.. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పారు. అప్పటికిగానీ పరిస్థితి సద్దుమణగలేదు. తన అంతిమ లక్ష్యం దిశగా ప్రకటన వెలువడటంతో డిసెంబర్ 9 రాత్రి కేసీఆర్ దీక్షను విరమించారు. నాటి కేసీఆర్ దీక్ష.. ప్రాణాలు లెక్కచేయని మొం డితనమే.. అప్పటి కేంద్ర ప్రభుత్వ మొద్దునిద్దుర వదిలించి.. ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షను గౌరవించేలా చేసింది. దశాబ్దాల స్వప్నాన్ని తన ప్రాణాలను పణంగా పెట్టి సాకారం చేసిన కేసీఆర్.. తెలంగాణ యోధుడిగా చరిత్ర పుటల్లో నిలిచారు. అందుకే ఆనాటి ఘటనలను నెమరు వేసుకుంటూ, నేడు అదే ఉద్యమ నేత ముఖ్యమంత్రిగా రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో కొత్త పుంతలు తొక్కిస్తూ.. బంగారు తెలంగాణ సాధన దిశగా సాగిస్తున్న పయనాన్ని మననం చేసుకుంటూ నవంబర్ 29ని తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా అమెరికాలో, ఇంగ్లండ్లో సైతం రాష్ట్ర సాధన విజయోత్సవంగా నిర్వహించుకుంటున్నారు.
- సోర్స్ : నమస్తే తెలంగాణ నుండి