తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు నేడు బుధవారం జీఈఎస్ సదస్సు సందర్భంగా జరిగిన ప్లీనరీ కి మాడరేటర్గా వ్యవహరించారు. ఈ ప్లీనరలో ప్యానలిస్టులుగా ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ చందా కొచ్చార్, డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్లు ఉన్నారు. మొదట ఐసీఐసీఐ సీఈవో చందా కొచ్చార్ను మంత్రి కేటీఆర్ వేదిక మీదకు ఆహ్వానించారు. ఆ తర్వాత అమెరికా అధ్యక్షుడి సలహాదారు ఇవాంకా ట్రంప్ను కూడా మంత్రి ఆహ్వానించారు. అయితే ఇవాంకాను పరిచయం చేసే సమయంలో మంత్రి కేటీఆర్ కొంత చమత్కారాన్ని ప్రదర్శించారు. తాను రాష్ర్టానికి ఐటీ మంత్రిని అని, కొన్ని రోజులుగా హైదరాబాద్లో ఐటీ నామస్మరణ జరుగుతున్నదని, ఐటీ అంటే ఇవాంకా ట్రంప్ అని మంత్రి కేటీఆర్ నవ్వులు పూయించారు.
