గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ పేరుతో హైదరాబాద్ వేదికగా సాగిన సదస్సును మంత్రి కేటీఆర్ పూర్తి విజయవంతంగా నిర్వహించారని పలువురు ప్రశంసిస్తున్నారు. జీఈఎస్ నిర్వహణ కోసం 8 ప్రధాన నగరాలు పోటీపడగా…హైదరాబాద్కు ఆ అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్ చొరవ, కృషి అభినందనీయమని చెప్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రం, ఏన్డీఏ భాగస్వామ్య పార్టీ కాకపోయినప్పటికీ…హైదరాబాద్కు అవకాశం దక్కేలా చేయడంలో మంత్రి కేటీఆర్ ముందు నుంచి వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్తున్నారు. కేంద్రంలోని మంత్రులు, అధికారులతో సఖ్యత కలిగి ఉండటం, ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన తీరుపై విశ్వసనీయత, మంత్రి కేటీఆర్ పనితీరుపై జాతీయ స్థాయిలో ఇప్పటికే ఉన్న సదభిప్రాయం ఈ మహత్తర అవకాశాన్ని దక్కించేందుకు కీలకంగా నిలిచాయని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో కేవలం కేంద్ర ప్రభుత్వాన్ని మాత్రమే మెప్పించడం కాకుండా…ఇటు జీఈఎస్ నిర్వహణలో కీలక వేదిక అయిన అమెరికా ప్రభుత్వాన్ని సైతం మెప్పించేలా ఆ దేశ అధికారులతో మంత్రి కేటీఆర్ సమన్వయం చేశారని పలువురు విశ్లేషిస్తున్నారు.
జీఈఎస్ విషయంలో మంత్రి కేటీఆర్ తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ ప్రశంసనీయమని పలువురు అంటున్నారు. వాలంటీర్ల వస్త్రాదరణ నుంచి మొదలుకొని అతిథులకు అందించాల్సిన కానుకల వరకు మంత్రి కేటీఆర ప్రత్యేక దృష్టి సారించారని చెప్తున్నారు. మహిళా వాలంటీర్లు పోచంపల్లి చీరలు ధరించడం, పురుష వాలంటీర్లు పోచంపల్లి కోట్లు వేసుకోవాలని మంత్రి కేటీఆర్ స్పష్టంగా చెప్పిన ఉదంతాన్ని పలువురు చెప్తున్నారు. పైగా అవి ఎలాంటి డిజైన్లలో ఉండాలో కూడా మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారని ఈ ప్రక్రియలో భాగం పంచుకున్న అధికారి ఒకరు తెలిపారు. జీఈఎస్ సదస్సు హైదరాబాద్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయనున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ముందు నుంచి శ్రద్ధతీసుకున్నారు. వర్షాకాలం ముగిసిన వెంటనే హైదరాబాద్ రోడ్ల మరమ్మత్తును చేపట్టేలా అధికారులకు దిశానిర్దేశం చేసిన మంత్రి…ఆ తదుపరి నగర సుందరీకరణపై కూడా దృష్టి సారించి జీఈఎస్ విజయవంతం అయ్యేందుకు వ్యూహాత్మకంగా పనిచేశారని గుర్తు చేస్తున్నారు.
ప్రపంచదేశాల నుంచి వక్తలు హాజరైన గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ వేదికగా మంత్రి కేటీఆర్ తన ముద్రను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లారని పలువురు గుర్తు చేస్తున్నారు. చక్కటి ఆంగ్ల భాషా ప్రావిణ్యానికి పెట్టింది పేరయిన మంత్రి కేటీఆర్ తన వాక్చాతుర్యంతో పాటుగా అద్భుతమైన కమ్యూనికేషన్ నైపుణ్యంతో అతిథులు ముగ్దులయ్యేలా మోడరేటర్గా వ్యవహరించారని పలువురు ప్రస్తావిస్తున్నారు. అగ్రరాజ్యధిపతి డొనాల్డ్ ట్రంప్ తనయ ఇవాంకా ట్రంప్, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ బ్లెయిర్ వంటి అంతర్జాతీయ ప్రముఖులతో పాటుగా నీతి అయోగ్ సీఈఓ అమితాబ్ కాంత్ వంటి కేంద్ర ప్రభుత్వ ముఖ్యులు, హర్షాభోగ్లే, సునిల్ గవాస్కర్ వంటి క్రికెటర్లు..ఇలా విభిన్న నేపథ్యం కలిగి ఉన్న వారితో కూడా మంత్రి కేటీఆర్ మాడరేటర్గా వ్యవహరించిన తీరు ఆయనలోని భిన్న విషయ పరిజ్ఞానాన్ని తెరమీదకు తెచ్చిందని విశ్లేషిస్తున్నారు. ఆపిల్ కంపెనీని హైదరాబాద్కు రప్పించడం ద్వారా మంత్రి కేటీఆర్ ప్రతిభ భారత్లోని పొరుగు రాష్ట్రాలకు చేరగా…జీఈఎస్తో అంతర్జాతీయ స్థాయికి చేరిందని పలువురు గుర్తు చేస్తున్నారు. స్థూలంగా ఇటు ఆహార్యం మొదలుకొని అటు బాడీ లాంగ్వేజ్ వరకు.. ఇటు సమన్వయం మొదలుకొని అటు తెలంగాణ సర్కారు చర్యలు..నిర్ణయాల వరకు మంత్రి కేటీఆర్ అంతా తానై నిర్వహించిన తీరు అద్భుతమని పేర్కొంటున్నారు. దీనికితోడుగా జీఈఎస్ అందించిన స్పూర్తిని కొనసాగించేలా..చివరి రోజు మహిళల కోసం ప్రత్యేకంగా వీహబ్ను ప్రకటించడం…అందుకు నిధులు మంజూరు చేయడం కూడా మంత్రి కేటీఆర్ స్తితప్రజ్ఞతను చాటిచెప్పిందని వివరిస్తున్నారు.
Post Views: 195