జనాభాలో 54 శాతం ఉన్న బీసీల సంక్షేమం కోసం పాటుపడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వేసిన ముందడుగు ఇటు అధికార, అటు విపక్ష ఎమ్మెల్యేలను ఆకట్టుకుంది. బీసీ ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశం అనంతరం అధికార పార్టీ నేతలతో పాటుగా విపక్ష నేతలు సైతం ప్రశంసించారు.
బీజేపీ డా.లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ సమావేశం జరగడం సంతోషకరమన్నారు. తెలంగాణ లో 54శాతం బీసీ జనాభా ఉందని ఈ సమావేశంలో విద్య, ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు, రాజకీయ అవకాశాలు, ఫీజ్ రియంబర్స్మెంట్ వంటి అంశాలపై చర్చ జరిగిందన్నారు. 3రోజులు సమావేశంలో పూర్తిస్థాయిలో చర్చించి ప్రభుత్వానికి నివేదిక అందించనున్నట్లు తెలిపాఉ. బడ్జెట్ కేటాయింపులు, సబ్ ప్లాన్ పై చర్చిస్తామన్నారు. అవసరమైతే జీవో లు, చట్టంలో మార్పులు సీఎం చేస్తామన్నారని ఇది సంతోషకరమన్నారు. బీసీ సంక్షేమంపై అవసరమైన తీర్మానాలు చేయనన్నట్లు వివరించారు. తమ వంతు నివేదికలు, సూచనలు ఇస్తామన్నారు.
బీసీ సంక్షేమం పై సమావేశం పెట్టటం చరిత్రలో గొప్ప విషయమని టీడీపీ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య తెలిపారు.పార్టీలకు అతీతంగా సమావేశం పెట్టటం గొప్ప విషయమని కొనియాడారు. అన్ని అంశాలపై చర్చించి బీసీ డిక్లరేషన్ ఇస్తే సీఎం అమలు చేస్తామన్నారు. 10వేల కోట్లతో సబ్ ప్లాన్, పూర్తి ఫీజ్ రీఎంబెర్స్ మెంట్ ఇవ్వాలని కోరామన్నారు. 12 ఫెడరేషన్లు పనితీరు మెరుగుపరచాలన్న దానిపై సూచనలు చేస్తామన్నారు. చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని సూచించామన్నారు. ప్రధానిని కలిసి పార్లమెంటు లో బిల్లు పెట్టటానికి అఖిలపక్షం ను ఢిల్లీ తీసుకెళతామన్నారని ఇది ఆహ్వానించదగ్గ విషయమన్నారు.