తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ..కన్న తల్లిదండ్రులు, గురువులు, మాతృభూమిని మరవొద్దని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలియజేశారు.
మన జీవితంలో గురువు ప్రాధాన్యత ఎప్పటికీ ఉంటుందని… గురువుకు ప్రత్యామ్నాయం ఎవరూ కాదన్నారు.గురువులను సత్కరించడం, సత్ప్రవర్తన, సదాచారానికి చిహ్నమన్నారు. గురువును సత్కరించి సత్ప్రవర్తన గుర్తు చేసిన సీఎం కేసీఆర్కు వెంకయ్య ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు. సీఎం కేసీఆర్కు భాషపై అమితమైన ప్రేమ ఉందని… సీఎం కేసీఆర్ సాహితీ ప్రియులన్నారు.పద్యం, గద్యం అంటే కేసీఆర్కు ఎనలేని అభిమానమన్నారు.
భాష సమాజాన్ని సృష్టిస్తుందన్నారు. భాష సహజమైన ప్రవాహమన్నారు. గురువుకు ప్రత్యామ్నాయం గూగుల్ కాదని.. ఇంటర్నెట్ సెర్చ్ చేసేందుకైనా గురువు ఉండాల్సిందేనన్నారు. తరగతి గది తరగని నిధి అని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ గడ్డపై ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అభినందనీయమన్నారు.దేశంలో హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగని వెంకయ్య ఈ సందర్బంగా గుర్తు చేశారు.