తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలు రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలోని ఎల్బీ స్టేడియంలోఅట్టహాసంగా ఇవాళ సాయంత్రం ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ వేడుకలకు గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యా సాగర్ రావు హాజరయ్యారు.ఈ క్రమంలో దేశంలోని 17 రాష్ర్టాలు, ఓ కేంద్ర పాలిత ప్రాంతం నుంచి ఎంతో మంది తెలుగు భాషా పండితులు, తెలుగు భాష అభిమానులు, తెలంగాణ ముద్దు బిడ్డలకు సీఎం కేసీఆర్ వందనం తెలియజేశారు.
ఈ సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ..
ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలనుంచి 400 మంది భాషాభిమానులు హాజరయ్యారని తెలిపారు.తెలంగాణ అద్భుతమైన సాహిత్యాన్ని పండించిన మాగాణమని ముఖ్యమంత్రి కొనియాడారు. తల్లి జోల పాటతోనే బిడ్డకు సాహిత్యాన్ని అలవాటు చేస్తుందని తెలిపారు.చిన్నతనంలోనే తన అమ్మ, నాన్న ఎన్నో పద్యాలు నేర్పినట్లు సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
తల్లిదండ్రులే మనకు తొలి గురువులన్నారు. అమ్మ భాషను అమితంగా ప్రేమించే మాన్యులు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అని సీఎం కొనియాడారు. తన చిన్నతనంలో గురువులు శతకపద్యాల ద్వారా నీతి బోధించేవాళ్లను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు భాషా వికాసం, పరిరక్షణకు అందరం సంకల్పం తీసుకోవాలన్నారు.సిద్దిపేట అద్భుతమైన సాహితీ క్షేత్రమన్నారు. ఎంతోమంది సాహితీ కుసుమాలు వికసించిన నేల సిద్దిపేట అని కొనియాడారు. భాష గొప్పతనాన్ని పెంచే కృషి ఎప్పటికీ కొనసాగాలన్నారు.
సరళమైన పదాలతో బమ్మెర పోతన భాగవతాన్ని అద్భుతంగా రచించారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. తెలంగాణ నేల ధిక్కార స్వరానికి ప్రతీకగా బమ్మెర పోతన నిలిచారని సీఎం తెలిపారు. పోతన భాగవతానికి వ్యాఖ్య రాసిన గొప్ప కవి సీ నారాయణ రెడ్డి (సినారె) అని సీఎం కొనియాడారు. సిరిసిల్ల గడ్డపై పుట్టిన సాహితీ కుసుమం సినారె అని కేసీఆర్ అన్నారు. తెలుగు భాష అజంతమైన భాష అని సీఎం పేర్కొన్నారు.
దాశరథి, కాళోజీ పేరుతో ఏటా పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభల్లో సీఎం ప్రసంగించారు. గోరటి వెంకన్న అద్భుతమైన వాగ్గేయకారుడన్న సీఎం… ఆయన రాసిన పాట “గల్లీ చిన్నది.. గరీబోళ్ల కథ పెద్దది” అనే పాటను పాడి సాహిత్య గొప్పతనాన్ని తెలిపారు.
అందెశ్రీ రచించిన “జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం” పాట ద్వారా తెలంగాణ ఉద్యమం ఉర్రూతలూగిందని తెలియజేశారు. జయరాజ్ రచించిన “వానమ్మ వానమ్మ” పాట.. వాన కోసం ఎదురు చూస్తున్న రైతుల గోసలను వివరిస్తుందన్నారు.ఇటువంటి అద్భుతమైన సాహిత్యం ఉన్న తెలంగాణ నేల ఎంతో గొప్పదన్నారు.
ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును కచ్చితమైన పాఠ్యాంశంగా చేర్చామని సీఎం వివరించారు. 10 రోజుల్లోగా భాషా పండితుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. సమాజాన్ని బతికించేవాడే బడి పంతులని ముఖ్యమంత్రి అన్నారు. తెలుగును విశ్వవ్యాప్తం చేసేందుకు అందరూ సంకల్పం తీసుకోవాలన్నారు.