తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రపంచ తెలుగు మహాసభలకు 42 దేశాలు, 17 రాష్ర్టాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి ప్రతినిధులు తరలివచ్చారని తెలిపారు. రవీంద్రభారతి, తెలుగు విశ్వవిద్యాలయం, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం, సారస్వత పరిషత్ వేదికల్లో చోటు సరిపోలేనంత సాహితీప్రియులు హాజరు కావడం చాలా సంతోషంగా ఉందన్నారు సీఎం. సాహితీప్రియుల సహకారం వల్ల తెలుగు మహాసభలు ఘనంగా జరుపుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. సభల ముగింపు రోజున చరిత్రాత్మకమైన నిర్ణయాలు వెల్లడిస్తామని కేసీఆర్ చెప్పారు.ప్రపంచ తెలుగు మహాసభల ద్వారా సాహిత్యానికి పూర్వ వైభవం వస్తుందన్నారు. కవి సమ్మేళనాలు, చర్చలు చాలా ఆసక్తికరంగా సాగుతున్నాయని తెలిపారు. సభ నిర్వహణ, అతిథులకు భోజన సదుపాయం కూడా బాగున్నాయని చెప్పారు. ఈ మధ్యకాలంలో సాహితీవేత్తలకు కాస్త ఆదరణ తగ్గిన మాట వాస్తవమేనని, ఇకపై అలాంటి పరిస్థితి ఉండదని సీఎం కేసీఆర్ అన్నారు.
