తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా తెలంగాణ సారస్వత పరిషత్లో అవధాని జీఎం రామశర్మచే నిర్వహించబడిన శతావధానం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవధాని రామశర్మ.. తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలను పద్యరూపంలో అద్భుతంగా వర్ణించారు. అనంతరం రామశర్మను సీఎం కేసీఆర్ శాలువాతో సత్కరించి సన్మానించారు.అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ప్రపంచ తెలుగు మహాసభలు చరిత్రలో నిలిచిపోయేలా దేదీప్యమానంగా జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సాహిత్య సమావేశాలకు అద్భుతమైన స్పందన వస్తుంటే గుండెల నిండా సంతోషంగా ఉందని సీఎం పేర్కొన్నారు.చిన్నపుడు నేను డాక్టర్ లేదా ఇంజినీర్ కావాలని మా నాన్న కోరుకునే వారని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. మా గురువు గారు సాహితీ కవాటాలు తెరిచి నన్ను సాహిత్యం వైపు తీసుకుపోయారని తెలిపారు. ఇంటర్ చదివే రోజుల్లో మా గురువులు తనను ఎంతో ప్రోత్సహించారని చెప్పారు. ఒకప్పుడు నాకు కూడా 3 వేల తెలుగు పద్యాలు కంఠస్తం వచ్చేవని సీఎం గుర్తు చేశారు.