ఇటీవలే కాంగ్రెస్లో చేరిన రేవంత్ రెడ్డిని బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి అడ్డంగా బుక్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ గుజరాత్, హిమాచల్ బీజేపీ గెలుపు చరిత్రాత్మకమని ఇవి అసాధారణ ఫలితాలని తెలిపారు. గుజరాత్ లో ఆరో సారి సూపర్ సిక్సర్, డబుల్ హ్యాట్రిక్ విజయాన్ని కుహనా మేధావులు, విశ్లేషకులు తక్కువ చేసి చూపిస్తున్నారని మండిపడ్డారు.
5 సంవత్సరాలు కాంగ్రేస్ ఓడిపోతే మాట్లాడటం లేదు, కానీ వరుసగా ఆరవ సారి గెలిస్తే తక్కువ చెయ్యడం దారుణమన్నారు. కిరాయి నాయకులతో కాంగ్రెస్ రెచ్చగొట్టి అధికారం కోసం ప్రయత్నం చేసి కాంగ్రెస్ బొక్కబోర్లా పడిందన్నారు. నిన్నటి దాకా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని పొగిడిన రేవంత్ ఇప్పుడు కాంగ్రెస్ లో చేరి సిద్ధాంతం గురించి మాట్లాడటం చిత్రంగా ఉందని..పలువురు సిగ్గుపడుతున్నారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇప్పుడు వచ్చిన సీట్లు కూడా భవిష్యత్తులో రావని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీది బలుపు కాదు అది వాపు అని అన్నారు. బీజేపీపై వ్యతిరేకతతో.. గుజరాత్ ప్రజలను, ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. యూపీలో గెలవలేని వారు..గుజరాత్ లో మోడీ మీద వ్యక్తిగత నీచ వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. నీచుడని, విదేశీ పుట్టగొడుగులు తిని తెల్లగా అవుతున్నారని దిగజారి మాట్లాడారని వారందరికీ..గుజరాత్ సమాధానం చెప్పిందన్నారు.