తెలంగాణ అభివృద్ధిలో తనదైన శైలిలో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలోని తెలంగాణ ప్రభుత్వం సాగు నీటి ప్రాజెక్టుల వంటి కీలక శాఖల్లో కేంద్ర ప్రభుత్వం నుండి ఈ మూడున్నరేళ్లలోనే మొత్తం 2000 వరకు అనుమతులు సాధించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పత్రిక ప్రశంసించింది . ఇతర రాష్ట్రాలు కీలకమైన ఒక్క అనుమతి పొందడానికే నానా కష్టాలు పడుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రంలోని వివిధ శాఖల నుండి ఇన్ని అనుమతులు పొందడం మామూలు విషయం కాదని ఆ కథనంలో పేర్కొన్నారు .
కేంద్రంలోని ఎన్ డీ ఏ ప్రభుత్వంలో టి ఆర్ ఎస్ భాగస్వామ్యం కాకపోయినప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనా దక్షతతో ఈ అనుమతులు సాధించడంలో కీలక భూమికను పోషించారని వివరించారు . కేంద్రంలోని వివిధ శాఖల్లో మంచి పరిచయాలు ఉన్న మాజీ చీఫ్ సెక్రటరీ , ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ సేవలను ముఖ్యమంత్రి ఉపయోగించుకున్నారని ఆ పత్రిక కథనంలో పేర్కొన్నారు . ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ హరి రామ్ కూడా నిత్యం పర్యవేక్షించారని , పలు మార్లు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కూడా ఢిల్లీకి వెళ్లి కృషి చేశారని పేర్కొన్నారు .
ఒక్క కాళేశ్వరం సాగు నీటి ప్రాజెక్టు కోసమే 106 అనుమతులు సాధించారని ఢిల్లీలోని ఒక ముఖ్య అధికారిని ఉటంకిస్తూ వివరించారు . ఇతర రాష్ట్రాలతో ఎలాంటి ఘర్షణ పూరిత వైఖరిని అవలంభించడం తమకు ఇష్టం లేదని స్నేహపూర్వక వైఖరి మీదే తమకు విశ్వాసం ఉన్నట్లు పలు మార్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో పాటు దానికి అనుగుణంగా ఆచరణాత్మక అడుగులు వేయడంతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం మహారాష్ట్రతో కీలకమైన అంతరాష్ట్ర ఒప్పందం సాధ్యమైందని పేర్కొన్నారు . ముఖ్యమంత్రి ప్రతి శాఖ పనుల విషయంలో సమీక్షించే విధానం వల్ల సాగు నీటి ప్రాజెక్టులు , విద్యుత్ ప్రాజెక్టులు , మిషన్ భగీరథ , రైల్వే , టూరిజం తదితర శాఖలకు అనుమతులు సాధించడంలో విజయం సాధించారని టైమ్స్ ఆఫ్ ఇండియా సక్సెస్ స్టోరీ ని ప్రచురించింది .