కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సుందిళ్ల ఆనకట్ట నిర్మిస్తున్న ప్రాంతంలోనే ఇంజినీర్లు, గుత్తేదారులతో రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును జూన్ నాటికి పూర్తి చేయాలని మంత్రి హరీష్రావు ఆదేశించారు. పక్కా కార్యాచరణ, ప్రణాళికతో ఒక రోడ్మ్యాప్ ప్రకారం పనులు చేయాలని గుత్తేదార్లకు, ఇంజినీర్లకు మంత్రి సూచించారు. మే 31 డెడ్లైన్గా పనుల పురోగతిని సాధిస్తే జూన్లో అన్ని పనులు పూర్తవుతాయన్నారు. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీల గేట్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్యాకేజీ 7లో పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. సుందిళ్ల ఆనకట్టకు ఇరువైపులా 2 ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్లు మంత్రి తెలిపారు.జనవరి నుంచి జూన్ వరకు ప్రతి వారం, ప్రతి నెల పనుల పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని ఇంజినీర్లకు మంత్రి ఆదేశాలిచ్చారు. ఏ రోజు ఎంత వరకు పని జరిగిందో ప్రొగ్రెస్ రిపోర్ట్ను మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు వాట్సాప్లో పంపాలని మంత్రి డెసిషన్ తీసుకున్నారు .